Telugu Global
National

మహా రాజకీయం: సీఎంగా ఫడ్నవీస్..? డిప్యూటీగా షిండే..?

సీఎం సీటు ఫడ్నవీస్ కి ఇచ్చి, డిప్యూటీగా ఏక్ నాథ్ షిండేని చేయాలని బీజేపీ అధిష్టానం ఆల్రడీ నిర్ణయం తీసుకుందట. ఈ విషయం షిండేకి తేల్చి చెప్పారని, దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజులు సెలవు పెట్టి వెళ్లిపోయారని అంటున్నారు.

మహా రాజకీయం: సీఎంగా ఫడ్నవీస్..? డిప్యూటీగా షిండే..?
X

మహారాష్ట్రలో సీఎం షిండే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా..? త్వరలో ఆయన మాజీ కాబోతున్నారా..? ఎన్నికలకు ఏడాది ముందు మహారాష్ట్రలో మళ్లీ ప్రభుత్వం మారే అవకాశముందా..? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. మహారాష్ట్రలో శివసేన చీలికవర్గంతో కలసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఏక్ నాథ్ షిండేకి సీఎం పోస్ట్ ఇచ్చి, ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా సర్దుకున్నారు. అయితే ఇటీవల ఎన్సీపీలోని అజిత్ పవార్ వర్గం బీజేపీలో చేరుతుందనే పుకార్లు వినిపించాయి. తనకా ఉద్దేశం లేదని అజిత్ పవార్ క్లారిటీ ఇచ్చినా ఎక్కడో చిన్న అనుమానం అందరిలో ఉంది.

అజిత్ వర్గం బీజేపీలో చేరినా, చేరకపోయినా.. ఎన్నికలకు ముందుగా మహారాష్ట్ర ప్రభుత్వంలో మార్పులు చేయాలనేది బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. సీఎం సీటు ఫడ్నవీస్ కి ఇచ్చి, డిప్యూటీగా ఏక్ నాథ్ షిండేని చేయాలని బీజేపీ అధిష్టానం ఆల్రడీ నిర్ణయం తీసుకుందట. ఈ విషయం షిండేకి తేల్చి చెప్పారని, దీంతో ఆయన మనస్తాపంతో మూడు రోజులు సెలవు పెట్టి వెళ్లిపోయారని అంటున్నారు. మహారాష్ట్రకు త్వరలో కొత్త సీఎం రాబోతున్నారని ఎన్సీపీ అధికార ప్రతినిధి క్లైడ్ క్యాస్ట్రో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారాయి.


క్యాస్ట్రో ట్వీట్ సంచలనంగా మారింది. సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు తమ బాధ్యతలు మార్చుకోవాలని బీజేపీ చెప్పిందని క్యాస్ట్రో తెలిపారు. త్వరతో ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు చేపడతారని, షిండే డిప్యూటీ సీఎం పదవికి పరిమితం అవుతారని చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారమేదీ బయటకు రాలేదు. ఎన్సీపీ నేత వ్యాఖ్యల్ని ఎలా నిజం అని నమ్మాలంటున్నారు మరికొందరు. కానీ అజిత్ పవార్ సంచలన నిర్ణయం తీసుకుంటే మాత్రం షిండే జాతకం తారుమారవడం ఖాయం. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్న మహారాష్ట్రలో ఇప్పుడీ రాజకీయ మార్పు ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది తేలాల్సి ఉంది.

First Published:  25 April 2023 11:28 AM GMT
Next Story