Telugu Global
National

బుల్డోజర్ ట్రీట్మెంట్ ఫ్యాషన్‌ అయిపోయిందన్న మధ్యప్రదేశ్‌ హైకోర్టు, పరిహారానికి ఆదేశం

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీకి చెందిన రాధా లాంగ్రీ అనే మహిళ ఇంటిని స్థానిక మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ బుల్డోజర్‌తో నేలమట్టం చేశారు.

బుల్డోజర్ ట్రీట్మెంట్ ఫ్యాషన్‌ అయిపోయిందన్న మధ్యప్రదేశ్‌ హైకోర్టు, పరిహారానికి ఆదేశం
X

ఉత్తర్‌ప్రదేశ్‌లో మొదలైన బుల్డోజర్ కూల్చివేతలు క్రమంగా ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తున్నాయి.కేసు ఏదైనా సరే నిందితులుగా, దోషులుగా గుర్తించిన వారికి సంబంధించిన అక్రమ కట్టడాలను స్థానిక మున్సిపల్ అధికారులు కూల్చి వేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన ఓ మహిళ ఇల్లు కూల్చివేతపై విచారణ సందర్భంగా ఆ రాష్ట్ర హైకోర్టు ఇండోర్‌ బెంచ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. మున్సిపల్‌ అధికారులు అమె ఇంటిని తప్పుగా కూల్చివేశారని పేర్కొన్న న్యాయస్థానం.. సరైన ప్రక్రియ అనుసరించకుండా ఇండ్లు కూల్చివేయడం స్థానిక పాలనా సంస్థలు, అధికారులకు ‘ఫ్యాషన్‌’ అయిపోయిందంటూ అసహనం వ్యక్తం చేసింది. బాధిత మహిళకు పరిహారం చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీకి చెందిన రాధా లాంగ్రీ అనే మహిళ ఇంటిని స్థానిక మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ బుల్డోజర్‌తో నేలమట్టం చేశారు. ఈ వ్యవహారంపై బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది. తన ఇల్లు నిబంధనల ప్రకారమే కట్టారని.. మున్సిపల్ అధికారులు కావాలనే తప్పుగా తన ఇంటిని కూల్చి వేశారని మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఇండోర్ బెంచ్‌కు మొర పెట్టుకుంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ వివేక్ రుషియా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా బాధితురాలి ఇంటిని కూల్చివేసినందుకు స్థానిక మున్సిపల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమెకు పరిహారంగా రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పును వెలువరించింది.

అధికారులు సహజ న్యాయ సూత్రాన్ని పాటించకుండా ఇష్టానుసారం ఇండ్లు కూల్చివేయడం.. సంబంధిత వార్త మీడియాలో వచ్చేలా చేయడం ఫ్యాషన్‌ అయిపోయిందని జస్టిస్‌ వివేక్‌ రుసియా నేతృత్వంలోని ధర్మాసనం ఈసందర్భంగా వ్యాఖ్యానించింది. కూల్చివేత అనేది ‘చివరి చర్య’గా ఉండాలని, అది కూడా ఇంటిని క్రమబద్దీకరించుకొనేందుకు యజమానికి సరైన అవకాశం ఇచ్చిన తర్వాత చేపట్టాలని అభిప్రాయపడింది. అలాగే అన్ని అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా ఇల్లు నిర్మించుకునే హక్కు కూడా ఎవరికీ లేదని కూడా హైకోర్టు పేర్కొంది. ఇళ్లు, భవనాలకు సంబంధించి నకిలీ పత్రాలు తయారు చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

గత కొంత కాలంగా ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అక్రమ కట్టడాలపై స్థానిక ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ బుల్డోజర్ సంస్కృతి పెరిగిపోవడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

First Published:  11 Feb 2024 6:37 AM GMT
Next Story