Telugu Global
National

ఏప్రిల్ ఒకటి నుంచి బార్ల మూసివేత.. ఎక్కడ అంటే..!

మధ్యప్రదేశ్‌లో నియంత్రిత మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఉమా భారతి కొద్ది రోజుల నుంచి మద్యం షాపుల ఎదురుగా ఆందోళన నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని బార్లను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

ఏప్రిల్ ఒకటి నుంచి బార్ల మూసివేత.. ఎక్కడ అంటే..!
X

మధ్యప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి చేస్తున్న పోరాటం ఫలించింది. ఎక్కడబడితే అక్కడ ఏర్పాటు చేస్తున్న బార్ల వల్ల రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయని, మహిళలకు భద్రత లేకుండా పోతోందని, రాష్ట్రంలో నియంత్రిత మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని ఉమా భారతి కొద్ది రోజుల నుంచి మద్యం షాపుల ఎదురుగా ఆందోళన నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని బార్లను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.

కొత్త ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన వివరాలను ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ మేరకు వెల్లడించారు. కొత్త ఎక్సైజ్ పాలసీ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని బార్లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రస్తుతం ఉన్న లిక్కర్ షాపుల కాంట్రాక్ట్ రెన్యూవల్ చార్జీలను 10 శాతం పెంచుతున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం లిక్కర్ షాపులను విద్యాసంస్థలు, బాలికల హాస్టళ్లు, ప్రార్థన మందిరాలకు 50 మీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తుండగా, ఆ దూరాన్ని 100 మీటర్లకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని మంత్రి ప్రకటించారు. నియంత్రిత మద్యం విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సీనియర్ నాయకురాలు ఉమా భారతి ఆందోళన చేపట్టడం, వచ్చే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

First Published:  21 Feb 2023 6:28 AM GMT
Next Story