Telugu Global
National

మరో ప్రమాదం.. ఈసారి లోకమాన్య ఎక్స్ ప్రెస్

వ్యాసర్ పాడి రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై బేసిన్‌ బ్రిడ్జ్‌ వద్దకు రైలు చేరుకోగానే ఇంజిన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణీకులు బోగీల నుంచి బయటకు పరుగులు తీశారు.

మరో ప్రమాదం.. ఈసారి లోకమాన్య ఎక్స్ ప్రెస్
X

మరో ప్రమాదం.. ఈసారి లోకమాన్య ఎక్స్ ప్రెస్

రైలెక్కాలంటేనే ప్రయాణికులు హడలిపోతున్నారు. ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదం తర్వాత వరుసగా మరికొన్ని ఉదాహరణలు భయపెట్టేలా ఉన్నాయి. గూడ్స్ రైళ్లు పలు చోట్ల పట్టాలు తప్పడం, ఇంకొన్ని చోట్ల వంగిపోయిన పట్టాలు చూసి లోకో పైలెట్లు ముందుగానే అప్రమత్తం కావడం వంటి సంఘటనలు జరిగాయి. గురువారం ఉదయం ఏపీలోని బాపట్ల సమీపంలో సంఘమిత్ర ఎక్స్ ప్రెస్ కి ఘోర ప్రమాదం తప్పింది. విరిగిన రైలు పట్టాని కీ మ్యాన్ గుర్తించడంతో ఘోరం తప్పిపోయింది. సాయంత్రానికి లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ విషయంలో కూడా ఇలాంటి ఘోర ప్రమాదం తప్పింది. ఏకంగా రైలులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో రైలు దిగి పరుగులు పెట్టారు.

నిత్యం ప్రయాణీకులతో అత్యంత రద్దీగా ఉండే లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు గురువారం సాయంత్రం పెను ప్రమాదం తప్పింది. వ్యాసర్ పాడి రైల్వే స్టేషన్ సమీపంలో చెన్నై బేసిన్‌ బ్రిడ్జ్‌ వద్దకు రైలు చేరుకోగానే ఇంజిన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణీకులు బోగీల నుంచి బయటకు పరుగులు తీశారు. రైలు చెన్నై నుంచి ముంబైకి బయలుదేరిన అరగంట తర్వాత ఈ ప్రమాదం జరిగింది. అయితే ఆ తర్వాత అధికారులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు. తిరిగి రైలు ప్రయాణం మొదలైంది.


మంట లేకుండానే పొగ..

రైల్వే అధికారులు మాత్రం మంట లేకుండానే పొగలొచ్చాయని చెబుతున్నారు. రైలులో మంటలు రాలేదని, కేవలం పొగ మాత్రమే వచ్చిందని వివరణ ఇచ్చారు. రైలింజన్ పవర్ కార్ మధ్య దట్టమైన పొగలు వచ్చాయి. రైలు బయలు దేరిన అరగంట తర్వాత పొగలు రావడంతో బేసిన్ బ్రిడ్జ్ వద్ద దీన్ని ఆపేశారు. ప్రయాణికులు భయపడి బయటకు దిగి పరుగులు తీశారు. ఎలక్ట్రిక్ కప్లర్ షార్ట్ సర్క్యూట్ కి గురైందని తెలిపిన అధికారులు సమస్యను పరిష్కరించిన తర్వాత రైలుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

First Published:  22 Jun 2023 5:55 PM GMT
Next Story