Telugu Global
National

ఫ్రిజ్ లో ప్రియురాలి శవం.. ఢిల్లీలో మరో ఘోరం

ప్రేయసిని కాదని, తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లికి సిద్ధపడ్డాడు సాహిల్. ఈ విషయం ప్రేయసి నిక్కీకి తెలిసి నిలదీసింది. చివరకు గొడవ పెద్దదై ప్రియురాలిని గొంతునులిమి చంపేశాడు సాహిల్.

ఫ్రిజ్ లో ప్రియురాలి శవం.. ఢిల్లీలో మరో ఘోరం
X

సహజీవనంలో ఉన్న ప్రియురాలు శ్రద్ధా వాకర్ ని దారుణంగా హత్య చేసిన ఆఫ్తాబ్ పూనావాలా ఘటన మరచిపోకముందే అలాంటిదే మరో ఘోరం ఢిల్లీలో జరిగింది. ఇక్కడ కూడా ప్రియురాలి శవాన్ని ప్రియుడు ఫ్రిజ్ లో దాచి పెట్టడం విశేషం. ఈ హత్యోదంతం ప్రేమికుల రోజున వెలుగు చూసింది. తనని కాదని ప్రియుడు మరో పెళ్లికి సిద్ధపడటం, ప్రియురాలు నిలదీయడంతో ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది.

ఢిల్లీ సమీపంలోని మిత్రోన్‌ గ్రామానికి చెందిన సాహిల్‌ గెహ్లాట్‌ అనే యువకుడు హర్యానాకు చెందిన నిక్కీ యాదవ్‌ అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. కోచింగ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ లో మొదలైన వీరి ప్రేమ సహజీవం వరకు వెళ్లింది. ఇంట్లో వ్యవహారం తెలియకుండా ఇద్దరూ ఢిల్లీలో పెళ్లి కాకుండానే కాపురం పెట్టారు. కొన్నాళ్లు అంతా బాగుంది. ఇటీవల సాహిల్ కు కుటుంబ సభ్యులు వేరే సంబంధం చూశారు. ప్రేయసిని కాదని, తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లికి సిద్ధపడ్డాడు సాహిల్. ఈ విషయం ప్రేయసి నిక్కీకి తెలిసి నిలదీసింది. చివరకు గొడవ పెద్దదై ప్రియురాలిని గొంతునులిమి చంపేశాడు సాహిల్.




ఫ్రిజ్ లో శవం..

ఫిబ్రవరి 10న సాహిల్ కి పెళ్లి ఫిక్స్ అయింది. దీంతో ముందు రోజు ఫిబ్రవరి 9న సాహిల్, నిక్కీ మరోసారి కలుసుకున్నారు. గోవాకు వెళ్లేందుకు నిక్కీ టికెట్లు బుక్ చేసింది, అతడిని కూడా తనతోపాటు తీసుకెళ్లాలనుకుంది. కానీ సాహిల్ రానన్నాడు. కారులోనే వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మొబైల్ ఫోన్ చార్జింగ్ వైర్ ని ఆమె గొంతుకి బిగించి చంపేశాడు సాహిల్. ఆ తర్వాత మృతదేహాన్ని ఊరిలో తమ కుటుంబానికి ఉన్న దాబా దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ ఫ్రిజ్ లో శవాన్ని దాచి పెట్టి వెళ్లిపోయాడు. హత్య చేసిన గంటల వ్యవధిలోనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మూడు రోజుల తర్వాత హత్యోదంతం బయటపడింది. ఆమె శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు సాహిల్ ని అరెస్ట్ చేశారు.

First Published:  15 Feb 2023 5:26 AM GMT
Next Story