Telugu Global
National

ఢిల్లీకి వస్తే చంపేస్తామంటున్నారు.. ఓ ఎంపీ ఆవేదన..

ఏకే-47తో కాల్చి చంపుతామంటూ బెదిరిస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు లైట్ టీసుకున్నారని అంటున్నారు సంజయ్ రౌత్. తన ఫిర్యాదుని పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేస్తున్నారని అన్నారు.

ఢిల్లీకి వస్తే చంపేస్తామంటున్నారు.. ఓ ఎంపీ ఆవేదన..
X

ఢిల్లీలో అడుగు పెడితే చంపేస్తామంటూ తనను బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్. గతంలోనూ తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఇప్పుడు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని అన్నారు. మహారాష్ట్రలో షిండే ప్రభుత్వం వచ్చాక, ఉద్ధవ్ వర్గానికి భద్రత తగ్గించారని, ఉద్దేశ పూర్వకంగానే తమకి ప్రాణహాని తలపెడుతున్నారని అన్నారు.

మూసేవాలా తరహాలో..

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, నాయకులకు భద్రత తగ్గించగానే.. గాయకుడు, కాంగ్రెస్ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య జరిగింది. ఆ హత్య చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచే తనకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు సంజయ్ రౌత్. సిద్ధూ మూసేవాలా తరహాలోనే తనని కూడా హత్య చేస్తామంటున్నారని చెబుతున్నారు సంజయ్ రౌత్. ఈమేరకు ముంబై పోలీసులకు రౌత్ ఫిర్యాదు చేశారు.

ఏకే-47తో

ఏకే-47తో కాల్చి చంపుతామంటూ బెదిరిస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు లైట్ టీసుకున్నారని అంటున్నారు సంజయ్ రౌత్. తన ఫిర్యాదుని పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష నేతల భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఎట్టకేలకు పోలీసులు రౌత్ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టారు. బెదిరింపులు కాల్ చేసిన ఫోన్‌ నెంబర్ ను ట్రేస్‌ చేస్తున్నామని తెలిపారు. ఓ అనుమానితుడిని అరెస్టు చేశామని చెప్పారు పోలీసులు.

First Published:  1 April 2023 10:58 AM GMT
Next Story