Telugu Global
National

ఏ పార్టీపై బీఆర్ఎస్ దెబ్బపడుతుందో..?

ఇప్పటిలెక్కల ప్రకారమైతే ముందు ప్రతిపక్షాలపైనే తీవ్ర ప్రభావం పడేట్లుగా ఉంది. ప్రతిపక్షాల్లో కూడా జనసేన పైన ఎక్కువ ప్రభావం ఉంటుందని అనుమానాలు పెరిగిపోతున్నాయి.

ఏ పార్టీపై బీఆర్ఎస్ దెబ్బపడుతుందో..?
X

ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్న ఘట్టం రానే వచ్చింది. ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ఎప్పుడు అడుగుపెడుతుందా అని చాలామంది ఎదురుచూశారు. అలాంటి ముచ్చట సోమవారం ప్రగతిభవన్లో గ్రాండ్ గా జరిగింది. తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, చింతల పార్ధసారధి, టీజే ప్రకాష్ తో పాటు మరికొంతమంది బీఆర్‌ఎస్ లో చేరారు. తోటను కేసీఆర్ బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా ప్రకటించారు.

సంక్రాంతి నుంచి మరిన్ని చేరికలుంటాయని, చాలామంది ప్రముఖులు బీఆర్ఎస్ లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు చెప్పారు. ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఎట్లుంటుందో చూస్తారంటూ చాలెంజ్ విసిరారు. అసలైన రాజకీయమంటే ఏమిటో ఏపీ జనాలకు బీఆర్ఎస్ చూపిస్తుందన్నారు. కేసీఆర్ ఊపుచూస్తుంటే 175 నియోజకవర్గాల్లోనూ పోటీచేసేట్లున్నారు. ఇదే జరిగితే ఏ పార్టీపైన బీఆర్ఎస్ ప్రభావం చూపుతుంది..?

ఇప్పటిలెక్కల ప్రకారమైతే ముందు ప్రతిపక్షాలపైనే తీవ్ర ప్రభావం పడేట్లుగా ఉంది. ప్రతిపక్షాల్లో కూడా జనసేన పైన ఎక్కువ ప్రభావం ఉంటుందని అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కాపుల ఓట్లపైనే కేసీఆర్ టార్గెట్ పెట్టినట్లు అర్థ‌మవుతోంది. తోట చంద్రశేఖర్, చింతల పార్ధసారధి కాపు ప్రముఖులే. వీరిలో తోట మొన్నటి వరకు జనసేనలో ఉండటమే కాకుండా పవన్ కల్యాణ్ అత్యంత సన్నిహితుడు కూడా. కాపు సామాజికవర్గంలో విస్తృతమైన సంబంధాలున్న నేత. కాబట్టి తన సాన్నిహిత్యాన్ని ఉపయోగించి వీలైనంతమంది కాపులను బీఆర్ఎస్ లో చేర్చేందుకు ప్రయత్నాలు చేస్తారు.

తోట ప్రయత్నాలు సక్సెస్ అయ్యేకొద్దీ డ్యామేజి జరిగేది జనసేనకే. అలాగే తర్వాత స్టెప్ టీడీపీ నేతలపైన గురిపెట్టారు. కేసీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళకు చాలామంది టీడీపీ సీనియర్లతో మంచి సంబంధాలున్నాయి. కాబట్టి వీలైనంతమంది తమ్ముళ్ళని లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఈ నేపధ్యంలో టీడీపీకి కూడా దెబ్బపడే అవకాశముంది. అలాగే వైసీపీలో టికెట్లు దక్కవ‌ని డిసైడ్ అయినవాళ్ళు కూడా బీఆర్ఎస్ లో చేరే అవకాశాలున్నాయి. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీపైన బీఆర్ఎస్ దెబ్బ పడుతుందో చూడాల్సిందే.

First Published:  3 Jan 2023 5:26 AM GMT
Next Story