Telugu Global
National

ఖుష్బూ ఆగ్రహం.. ఎయిరిండియా క్షమాపణ

"ఎయిరిండియాకు ఈ దుస్థితి ఏంటి..? ఒక వీల్ చైర్ కోసం కాలి గాయంతో ఇబ్బంది పడుతున్న మహిళ అరగంటకు పైగా వేచి చూడాలా..?" అంటూ సినీ నటి ఖుష్బూ ఘాటుగా ఓ ట్వీట్ వేశారు.

ఖుష్బూ ఆగ్రహం.. ఎయిరిండియా క్షమాపణ
X

ఇటీవల వరుస వివాదాలు, జరిమానాలతో ఎయిరిండియా సంస్థ సతమతం అవుతోంది. తాజాగా మరోసారి ఆ ఎయిర్ లైన్స్ డొల్లతనం బయటపడింది. పేరుగొప్ప విమాన సంస్థ కోసం చెన్నై ఎయిర్ పోర్ట్ లో కనీసం ఒక వీల్ చైర్ కూడా లేదు. అత్యవసరం అయ్యే సరికి మరో ఎయిర్ లైన్స్ నుంచి అరువు తెచ్చుకున్నారు సిబ్బంది. "ఎయిరిండియాకు ఈ దుస్థితి ఏంటి..? ఒక వీల్ చైర్ కోసం కాలి గాయంతో ఇబ్బంది పడుతున్న మహిళ అరగంటకు పైగా వేచి చూడాలా..?" అంటూ సినీ నటి ఖుష్బూ ఘాటుగా ఓ ట్వీట్ వేశారు. దీంతో ఈ వ్యవహారం బయటపడింది.

అసలేం జరిగింది..?

సినీ నటి ఖుష్బూ చెన్నైలో విమానం ఎక్కేందుకు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. ఆమె మోకాలి గాయంతో బాధపడుతున్నారు. ఎయిరిండియాలో టికెట్ బుక్ చేసుకున్న ఆమె, ఎయిర్ పోర్ట్ కి వచ్చిన తర్వాత వీల్ చైర్ సహాయం అడిగారు. సిబ్బంది లేదన్నారు. ఆమెకు కోపం వచ్చింది. వెయిట్ చేస్తాను, తీసుకు రండి అని చెప్పారు. లోపలికి వెళ్లిన ఎయిరిండియా సిబ్బంది అరగంట తర్వాత వచ్చారు, అది కూడా పక్క ఎయిర్ లైన్స్ కంపెనీ నుంచి తెప్పించి అడ్జస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై ఖుష్బూ తీవ్రంగా స్పందించారు. ఎయిరిండియాను ట్యాగ్ చేస్తూ ఘాటుగా ఓ ట్వీట్ పెట్టారు.


క్షమాపణ..

అసలే వరుస సంచలన ఘటనలతో ఎయిరిండియా పరువుపోతోంది. జరిమానాలు కట్టడంతోపాటు, సోషల్ మీడియాలో దోషిగా నిలబడాల్సి వస్తోంది. ఇప్పుడు ఖుష్బూ చేసిన ట్వీట్ ఎయిరిండియాకి మరింత డ్యామేజీగా మారింది. కనీసం వీల్ చైర్ కూడా లేకుండా ఎయిరిండియా చెన్నై ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికుల్ని ఇబ్బందికి గురిచేస్తోందంటూ ఖుష్బూ వేసిన ట్వీట్ కి వెంటనే ఎయిరిండియా సంస్థ స్పందించింది. ఆమెకు సారీ చెప్పింది. ‘‘మా వల్ల మీకు ఎదురైన ఇబ్బందికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. దీన్ని వెంటనే చెన్నై ఎయిర్‌ పోర్టు టీమ్‌ దృష్టికి తీసుకెళ్తాం’’ అని ఎయిరిండియా బదులిచ్చింది.

First Published:  1 Feb 2023 12:47 AM GMT
Next Story