Telugu Global
National

కేరళ పోలీస్ స్టేషన్ లో వాంగ్మూలమిచ్చిన కాంతార హీరో

ఇవాళ రిషబ్ శెట్టి, కిర్గం దూర్ కోజికోడ్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు రిషబ్ శెట్టి వాంగ్మూలాన్ని తీసుకున్న‌ట్టు కేరళ పోలీసులు తెలిపారు. అవసరమైతే ఆయనను మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పారు.

కేరళ పోలీస్ స్టేషన్ లో వాంగ్మూలమిచ్చిన కాంతార హీరో
X

గత ఏడాది విడుద‌లైన‌ కన్నడ సినిమా కాంతార దేశవ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం నమోదు చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా క్లైమాక్స్ లో పది నిమిషాల పాటు సాగే వరాహ రూపం అనే పాట ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చింది. అందులో హీరో రిషబ్ శెట్టి అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే ఈ పాటను తమ వద్ద నుంచి కాంతార బృందం కాపీ కొట్టిందని కేరళకు చెందిన ఒక మ్యూజిక్ బ్యాండ్ ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ సినిమాలో వరాహ రూపం పాటను తొలగించారు.

అయితే దీనిపై చిత్ర బృందం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కేరళ హైకోర్టు విధించిన షరతుపై స్టే విధించింది. అలాగే ఈ సినిమా నిర్మాత విజయ్ కిర్గందూర్, దర్శకుడు, హీరో రిషబ్ శెట్టిలను అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ పై విడుదల చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉండగా ఇటీవల కేరళ హైకోర్టు రిషబ్ శెట్టి, కిర్గం దూర్ లకు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అలాగే ఈనెల 12,13 తేదీల్లో రెండు రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల మధ్య కేసు విచారణ జరుగుతున్న కోజికోడ్ పోలీస్ స్టేషన్లో హాజరుకావాలని సమన్లు జారీ చేసింది.

నిన్న, ఇవాళ రిషబ్ శెట్టి, కిర్గం దూర్ కోజికోడ్ పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల మేరకు రిషబ్ శెట్టి వాంగ్మూలాన్ని తీసుకున్న‌ట్టు కేరళ పోలీసులు తెలిపారు. అవసరమైతే ఆయనను మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పారు. కాగా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అయిన కాంతార సినిమాకు సీక్వెల్ కూడా తీస్తున్నట్లు ఇటీవల చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం రిషబ్ శెట్టి కథను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.

First Published:  13 Feb 2023 10:48 AM GMT
Next Story