Telugu Global
National

'ఫేక్‌న్యూస్' గుర్తించడం ఎలా? కేరళ పాఠశాలల్లో విజయవంతంగా శిక్షణ

5 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సోషల్ మీడియాపై అవగాహన, ఫేక్‌న్యూస్ గుర్తింపు, వాటిని ఎలా అరికట్టాలనే విషయాలపై శిక్షణ ఇస్తున్నారు.

ఫేక్‌న్యూస్ గుర్తించడం ఎలా? కేరళ పాఠశాలల్లో విజయవంతంగా శిక్షణ
X

ఇంటర్నెట్ అందరికీ చౌక ధరల్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న 'ఫేక్‌న్యూస్' కట్టడి చేయడం ఆయా సంస్థలకే తలకు మించిన భారంగా మారిపోయాయి. అసలు ఏది నిజమో? ఏది అబద్దమో? కూడా గుర్తించలేనంతగా అబద్దపు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి అవాస్తవాలను చదువుకున్న వాళ్లు, మేధావులుగా పిలవబడే వాళ్లు కూడా ఫార్యర్డ్ కొడుతుండటం ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారింది. దీంతో సామాన్యులు అవే నిజమనుకొని నమ్మే పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఫేక్ వార్తల వ్యాప్తి ఎక్కువయ్యింది. ముఖ్యంగా ఆ పార్టీ ఐటీ సెల్ ప్రతీ రోజు ఏదో ఒక అబద్దపు వార్తను ప్రచారంలోకి తెస్తోంది. వీటి నుంచి తమ విద్యార్థులను కాపాడుకునే ఉద్దేశంతో కేరళ ప్రభుత్వం వినూత్న ప్రాజెక్టును ప్రారంభించింది.

కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ (కైట్)ను రెండేళ్ల క్రితం ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సోషల్ మీడియాపై అవగాహన, ఫేక్‌న్యూస్ గుర్తింపు, వాటిని ఎలా అరికట్టాలనే విషయాలపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే మూడు దశల్లో మొత్తం 19.72 లక్షల మందికి ఈ కార్యక్రమంలో శిక్షణ ఇచ్చినట్లు మంత్రి వి. శివన్ కుట్టి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సత్యమేవ జయతే డిజిటల్ లిటరసీ ప్రోగ్రాం కింద పని చేస్తున్న 5.920 మంది ట్రైనర్లు మూడు దశల్లో 9.48 లక్షల మంది అప్పర్ ప్రైమరీ, 10.24 లక్షల మంది హైస్కూల్ విద్యార్థులకు శిక్షణను పూర్తి చేశారు. 2021 ఫిబ్రవరి 10న తొలి దశలో కైట్స్ విక్టర్స్ అనే ప్రభుత్వ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా శిక్షణ ఇచ్చారు. అదే ఏడాది జూన్‌లో రెండో దశలో మరి కొంత మందికి.. ఈ ఏడాది అగస్టులో ఆఫ్ లైన్ క్లాసుల ద్వారా శిక్షణ పూర్తి చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూల్స్‌కు చెందిన విద్యార్థులు ఈ శిక్షణను తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ శిక్షణలో భాగంగా ప్రతీ విద్యార్థి రెండున్నర గంటల నిడివి ఉండే నాలుగు సెక్షన్ల పాఠాలను నేర్చుకుంటాడు. ప్రతీ రోజు మనం ఇంటర్నెట్‌ను ఎలా ఉపయోగించాలి. సోషల్ మీడియాలో ఏం చేయాలి ఏం చేయకూడదు. ఫేక్ న్యూస్‌ను ఎలా గుర్తించాలి. అలాగే దాన్ని వ్యాప్తి చేయకుండా ఎలా నిరోధించాలి. డిజిటల్ మీడియ ప్రాధాన్యత, ఉపయోగాలు అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా ఫేక్ న్యూస్‌ను గుర్తించే టెక్నికల్ అంశాలపై పూర్తి అవగాహన కల్పించారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీని ఎలా మిస్ యూజ్ చేస్తున్నారో కూడా ఓ పాఠ్యాంశంగా బోధించారు.

ఇక విద్యార్థులకే కాకుండా సామాన్యులకు కూడా ఫేక్‌న్యూస్‌పై అవగాహన కల్పిస్తున్నారు.కైట్స్ వాళ్ల విక్టర్స్ చానల్‌లో అక్టోబర్ నెల రెండో వారంలో ప్రతీ రోజు రాత్రి 7.00 గంటలకు ఈ శిక్షణకు సంబంధించిన కార్యక్రమం ప్రసారం అవుతున్నది. విద్యార్థులకు బోధించిన అంశాలే ఈ టీవీ కార్యక్రమంలో ప్రసారం చేయనున్నారు. దీని ద్వారా సామాన్యులకు కూడా ఫేక్‌న్యూస్‌పై అవగాహన కలుగుతుందని అధికారులు చెప్తున్నారు.

First Published:  11 Oct 2022 11:32 AM GMT
Next Story