Telugu Global
National

కన్నడ నాట కలకలం.. ఆ పుస్తకంతో ఆర్ఎస్ఎస్ కలవరం

కర్నాటక దళిత రచయిత దేవనూర మహాదేవ ఆరెస్సెస్ పై రాసిన ఓ చిన్న పుస్తకం ఇప్పుడు కర్నాటకలో సంచలనం సృష్టిస్తోంది. ఆ పుస్తకాన్ని ఎలా ఎదుర్కోవాలో అర్దం కాక ఆరెస్సెస్ రగిలిపోతోంది.

కన్నడ నాట కలకలం.. ఆ పుస్తకంతో ఆర్ఎస్ఎస్ కలవరం
X

కర్ణాటకలో ప్రస్తుతం ఆ రచయిత పేరు చెబితేనే ఓ వర్గం హడలెత్తిపోతోంది. కేవలం తన చిన్నపాటి పుస్తకంతోనే ఆయన రాష్ట్రంలోని సివిల్ సొసైటీని వణికిస్తున్నాడు. ముఖ్యంగా బీజేపీ 'ఆదిగురువైన' ఆర్ఎస్ఎస్... బహిరంగంగా ఏమీ విమర్శించలేక లోలోపల ఆగ్రహంతో రగిలిపోతోంది. ఆ రచయితే దేవనూర మహాదేవ.. 'ఆర్ఎస్ఎస్.. ఆల మట్టు అగల' ('ఆర్ఎస్ఎస్.. దాని మూలం, దాని శ్వాస') పేరిట ఆయన రాసిన కన్నడ పుస్తకం మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి హాట్ హాట్ గా ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలోని మితవాద బృందాలు ఈ పుస్తకాన్ని, దేవనూరను ఎలాగైనా ఎండగట్టాలని చేయని ప్రయత్నమంటూ లేదు. దీన్ని 'పీస్ ఆఫ్ ట్రాష్' (వట్టి చెత్త) అని తనను సీనియర్ జర్నలిస్టుగా చెప్పుకుంటున్న విశ్వేశ్వర భట్ .తన .ట్విట్టర్ లో పేర్కొన్నారు. కన్నడ డైలీ 'విశ్వవాణి' కి ఆయన చీఫ్ ఎడిటర్ కూడా.. ఇంకొకాయన ఉన్నాడు.. ఆయనే వివాదాస్పద టెక్స్ట్ బుక్ రివిజన్ కమిటీకి మాజీ హెడ్ అయిన రోహిత్ చక్రతీర్థ.. 'హోస దిగంత' అనే డైలీలో ఈయన ఈ పుస్తకాన్ని విమర్శించి తన వైఖరేమిటో బయటపెట్టుకున్నారు. ఇక న్యూస్ ఛానల్స్ సంగతి సరేసరి ! 'రైట్ లీనింగ్' భావాలున్న ఛానల్స్ అన్నీ ఇదే పని పెట్టుకున్నాయి.

'ఆర్ఎస్ఎస్ ఆల మట్టు అగల' బుక్ విడుదలైన వెంటనే 10 వేల కాపీలు అమ్ముడుపోయాయట. మరో 70 వేలకు పైగా కాపీలు ప్రింట్ దశలో ఉన్నాయి. వీటికి డిమాండ్ పెరుగుతూ... పబ్లిషర్లకు అందుతున్న ఆర్దర్లకు లెక్క లేదు. రచయిత దేవనూర మహాదేవ తన పుస్తకాన్ని కేవలం కన్నడ భాషలోనే రాసినా ఇది మరింత విస్తృతం కావడానికి అనువుగా తెలుగు, తమిళం వంటి మరో ఆరు భాషల్లోకూడా విడుదలయ్యేట్టు ప్రణాళిక రూపొందించుకున్నారు. తెలుగు, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ లాంటి భాషల్లో అనువాద పుస్తకాలు ముద్రణా దశల్లో ఉన్నాయి. చిన్నా, పెద్దా ప్రచురణకర్తలంతా అప్పుడే ఈ పుస్తక కాపీలను పంపిణీ చేయడమే బాధ్యతగా పెట్టుకున్నారంటే.. ఆర్ఎస్ఎస్ కుహనా పోకడలమీద వారెంత ద్వేషం పెంచుకున్నారో అర్థమవుతోంది.

ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏమిటి ?

ఈ పుస్తకంలోని ప్రథమార్థంలో దేవనూర.. ఆర్ఎస్ఎస్ కోర్ ఎజెండా ఏమిటో వివరించారు. ప్రతి వ్యక్తికీ సమానత్వం ఉండాలన్న అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చేయడానికి ఆ సంస్ధ చేస్తున్న‌ ప్రయత్నం... చతుర్వర్ణ వ్యవస్థపై గల సోపానక్రమం స్థానే మనుస్మృతి రావాలన్న ఈ సంస్థ ఆలోచన... భారత రాజ్యాంగం బదులు మనుస్మృతి వ్యవస్థ ఉండాలన్న ఈ సంస్థ ఉద్దేశంలోని ఔచిత్యమేమిటి ? 'టు డే మనుస్మృతి ఈజ్ హిందూ లా' (ఈనాడు మనుస్మృతి హిందూ చట్టం) అన్న ఆర్ఎస్ఎస్ భావజాలం నేటి సమాజానికి పనికి వస్తుందా ? అని ఈ రచయిత ప్రశ్నించారు. మన ఫెడరల్ వ్యవస్థలో మళ్ళీ మనుస్మృతిని ప్రవేశపెట్టడానికి ఈ సంస్థ యత్నిస్తోందని, మైనారిటీలను, దళితులను అణగదొక్కాలన్న భావనను వ్యక్తం చేస్తోందని, సంస్కృతాన్ని రుద్దాలని ఒత్తిడి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇదంతా నాజీ జర్మనీ పోకడలను స్ఫూర్తిగా తీసుకున్నట్టు కనిపిస్తోందన్నారు. ఇక రెండో భాగంలో వర్తమాన పరిస్థితులపై ఆయన తన ఆలోచనలకు పదునుపెట్టారు. జీఎస్టీ నుంచి ప్రైవేటీకరణ, హిజాబ్ నుంచి పౌరసత్వ సవరణ చట్టం, మత మార్పిడి వ్యతిరేక చట్టాలు వంటివాటిని ఆయన ప్రస్తావించారు. వీటిలో ఒక్కొక్కదాన్ని ఆర్ఎస్ఎస్ తన ఎజెండాలకు అనుగుణంగా ఎలా మారుస్తూ వచ్చిందో వివరించారు. చరిత్రలో మొదటిసారిగా రాజ్యాంగ సంస్కరణల ద్వారా మహిళలు, దళితులకు, బహుజనులకు, మైనారిటీలకు సంక్రమించిన ప్రయోజనాలను మార్చివేయడానికి ఎలాంటి ప్రయత్నం జరిగిందో ఆయన తన పుస్తకంలో వివరించారు. ఈ ప్రయత్నం మళ్ళీ ఈ వర్గాలను పాత కొలోనియల్ దశల్లోకి తీసుకువెళ్లేవిగాఉందని, ఆర్ఎస్ఎస్, బీజేపీ... ఎమోషనల్ సమస్యలను తమకు అనువుగా మార్చుకోవడానికి చేసిన యత్నమే ఇదని ఆయన అన్నారు. ఈ ఆర్ఎస్ఎస్ 'గ్రాండ్ స్కీం' ని కూల్చివేయడానికి ప్రగతిశీల శక్తులన్నీ.. విపక్షాలు, సివిల్ సొసైటీ సంస్థలు, ప్రజాఉద్యమాలకు పూనుకోవాలని, ఈ బృహత్తర బాధ్యత వీటిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. మీ సంకుచిత రాజకీయాలకు అతీతంగా స్పందించండి.. సమిష్టిగా ప్రేమ, అభిమానం కలబోసిన సమాజావిష్కరణకు కృషి చేయండి అని దేవనూర పేర్కొన్నారు. 130 కోట్ల మంది దేశ ప్రజలు ఒక్కటై ఆలోచించాలని ఆయన కోరారు.

కేవలం 64 పేజీల పుస్తకంలో ఎంత భావోద్వేగం ?

దేవనూర రాసిన ఈ పుస్తకంలో కేవలం 64 పేజీలు మాత్రమే ఉన్నాయి. పాఠకులు ఒక్కసారిగా దీన్ని చదివేయవచ్చు. మాస్ రైటర్ గా పాపులర్ అయిన ఈయన తన భావాలతో రీడర్ ని మెస్మరైజ్ చేశారు. దళిత రచయిత అయినప్పటికీ.. బెంగుళూరు, మైసూరు, మంగుళూరు, ధార్వాడ్ వంటి అగ్రహారాలను దాటి ఆయన భావాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. 'కుసుమ బాలే', 'ఒదాలాల' వంటి ఈయన పుస్తకాలు కర్ణాటకలో ప్రతి ఇంటా దర్శనమిస్తున్నాయి. ఇవి రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులకు నోచుకున్నాయి. ఆధునిక కన్నడ సాహిత్య రంగంలో దేవనూర తనకంటూ ప్రత్యేక స్థానమేర్పరచుకున్నారు. ఈయన రాసిన తాజా బుక్ తెలుగులో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆతృతగా తెలుగు రాష్ట్రాల్లో ఎదురు చూడని వారు లేరు.

First Published:  21 July 2022 4:29 AM GMT
Next Story