Telugu Global
National

భర్తపై దాడి చేసి యువతిపై గ్యాంగ్ రేప్.. వివస్త్రగా గ్రామానికి చేరుకున్న బాధితురాలు

దుండగుల దాడిలో గాయపడ్డ భర్త స్పృహలోకి వచ్చాడు. బోరియో పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

భర్తపై దాడి చేసి యువతిపై గ్యాంగ్ రేప్.. వివస్త్రగా గ్రామానికి చేరుకున్న బాధితురాలు
X

జార్ఖండ్ రాష్ట్రంలో దారుణ సంఘటన జరిగింది. సమీప పట్టణానికి వచ్చిన దంపతులు తిరిగి ఇంటికి వెళుతుండగా కొందరు దుండగులు వారిని అడ్డగించారు. భర్తపై దాడి చేసి 20 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఈ కేసులో ఇప్పటివరకు ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

వివ‌రాల్లోకి వెళ్లితే.. బోరియో జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు గురువారం జెట్కే కుమ్ రార్ జోరీ పట్టణానికి బైక్ పై వెళ్లి సాయంత్రం తిరుగు ప్రయాణమ‌య్యారు. మార్గమధ్యలో కొందరు దుండగులు వారి వాహనాన్ని అడ్డుకున్నారు. యువతిని లాక్కెళ్ళే ప్రయత్నం చేయగా భర్త అడ్డుకున్నాడు. దీంతో అతడిని దుండగులు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత వారు యువతిని సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారి నుంచి తప్పించుకున్న యువతి నగ్నంగానే గ్రామానికి చేరుకుంది. విషయాన్ని గ్రామస్తులకు తెలియజేసింది. అయితే ఈ విషయమై గ్రామస్తులు పోలీసులకు స‌మాచారం అందించ‌లేదు.

ఆ తర్వాత దుండగుల దాడిలో గాయపడ్డ భర్త స్పృహలోకి వచ్చాడు. బోరియో పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. అనంతరం పోలీసులు బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం సాహిబ్ గంజ్ సదర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మొత్తం ఏడుగురు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డట్లు గుర్తించారు. వీరందరిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్లు బోరియో పోలీసు అధికారి జగన్నాథ్ తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

First Published:  30 April 2023 12:45 PM GMT
Next Story