Telugu Global
National

ప్రధాని కార్యక్రమంలో జైశ్రీరాం నినాదాలు... అలిగిన మమతా బెనర్జీ

సీఎం మమతా బెనర్జీ రైల్వే స్టేష‌న్ దగ్గరికి చేరుకోగానే అక్కడున్న బీజేపీ కార్యకర్తలు, జై శ్రీరాం, జై మోడీ అంటూ నినాదాలు చేశారు. వారు నినాదాలు ఆపకుండా కొనసాగించడం తో ఆగ్రహం చెందిన మమతా బెనర్జీ వేదిక ఎక్కకుండా కిందనే కూర్చుండిపోయారు.

ప్రధాని కార్యక్రమంలో జైశ్రీరాం నినాదాలు... అలిగిన మమతా బెనర్జీ
X

భారత దేశపు ఏడవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ను ఈ రోజు కలకత్తా హౌరా రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మోడీ గుజరాత్ నుంచి పాల్గొనగా, కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ , బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ , రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు.

అయితే సీఎం మమతా బెనర్జీ రైల్వే స్టేష‌న్ దగ్గరికి చేరుకోగానే అక్కడున్న బీజేపీ కార్యకర్తలు, జై శ్రీరాం, జై మోడీ అంటూ నినాదాలు చేశారు. వారు నినాదాలు ఆపకుండా కొనసాగించడం తో ఆగ్రహం చెందిన మమతా బెనర్జీ వేదిక ఎక్కకుండా కిందనే కూర్చుండిపోయారు. ఆమెతో పాటు రాష్ట్ర అధికారులు కూడా కిందనే కూర్చున్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ , బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ లు ఆమెను సముదాయించడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె ఆగ్రహం చల్లారలేదు. వేదిక మీదికి రావడానికి ససేమిరా అన్నారామె.

అనంతరం మోదీ వర్చువల్ గా హౌరా, న్యూ జల్‌పైగురి మధ్య నడిచే సెమీ-హై-స్పీడ్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ తల్లి హీరాబెన్ మరణంపట్ల మమతా బెనర్జీ సంతాపం తెలియజేశారు. ''అమ్మకు మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఆమె మీకే కాదు మాకు కూడా అమ్మే. నేను కూడా అమ్మను చాలా మిస్ అయ్యాను. మీరు వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు గర్వ‌కారణం. ఈ కార్యక్రమం తర్వాత మీరు విశ్రాంతి తీసుకోండి'' అని మమతా బెనర్జీ ప్రధాని మోడీకి సూచించారు.

ఒక వైపు కోపం , మరో వైపు ప్రేమ ఒకే సారి చూపించడం మమతా బెనర్జీకే చెల్లింది.

First Published:  30 Dec 2022 10:45 AM GMT
Next Story