Telugu Global
National

చంద్ర‌యాన్‌.. మ‌రోసారి.. - ముహూర్తం ఖ‌రారు చేసిన ఇస్రో

శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ ఎం-3 భారీ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.615 కోట్లు కేటాయించింది.

చంద్ర‌యాన్‌.. మ‌రోసారి.. - ముహూర్తం ఖ‌రారు చేసిన ఇస్రో
X

చంద్రయాన్-3 ప్రయోగానికి ముహూర్తం ఖరారైంది. జూలై 13 మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రుడి వైపు దూసుకెళ్లనుంది. ఈ విషయాన్ని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) అధికారికంగా ప్రకటించింది. యువ శాస్త్రవేత్త వీరముత్తుయేల్ సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ ఉపగ్రహం అనుసంధాన పనులతో పాటు రోవర్, ల్యాండర్ బిగింపు పనులు ఏకకాలంలో చేస్తున్నారు. శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ ఎం-3 భారీ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.615 కోట్లు కేటాయించింది.

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్ర‌యోగం ఇప్ప‌టికే రెండుసార్లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. చంద్రయాన్-1ను 2008లో చేపట్టగా.. అది విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలను గుర్తించింది. అది రెండేళ్ల పాటు పనిచేసే విధంగా రూపొందించినప్పటికీ.. దాదాపు ఏడాదిలోనే దాంతో సంబంధాలు తెగిపోయాయి. చంద్రుడి చుట్టూ తిరుగుతూ మొత్తం 312 రోజులు సేవలందించిన తర్వాత ఆ మిషన్ ముగిసినట్లు 2009 ఆగస్టులో ఇస్రో ప్రకటించింది.

అనంతరం చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని ఆవిష్కరించడమే లక్ష్యంగా ఇస్రో చేపట్టిన చంద్రయాన్-2.. చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ స‌మ‌యంలో విఫ‌ల‌మైంది. ఎనిమిది సాంకేతిక పరికరాలతో కూడిన దాని ఆర్బిటర్ మాత్రం చంద్రుడి కక్ష్యలో విజయవంతంగా తిరుగుతోంది. తాజాగా చేపడుతున్న చంద్రయాన్ -3 మిషన్ విజయవంతమైతే మాత్రం భారత అంతరిక్ష పరిశోధనలో కీలక అడుగుపడినట్టే.

First Published:  28 Jun 2023 3:23 PM GMT
Next Story