Telugu Global
National

భారతీయ మహిళా శాస్త్రవేత్తకు నార్మన్ బోర్లాగ్ అవార్డ్

స్వాతి నాయక్ న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఆర్‌ఆర్‌ఐ)లో విత్తన వ్యవస్థ, ఉత్పత్తి నిర్వహణకు దక్షిణాసియా లీడ్‌గా పనిచేస్తున్నారు. వరిపంట సాగు చేస్తున్న చిన్న రైతులకు అందించిన సేవలకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది.

భారతీయ మహిళా శాస్త్రవేత్తకు నార్మన్ బోర్లాగ్ అవార్డ్
X

భారతీయ మహిళా శాస్త్రవేత్తను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఇంటర్నేషనల్‌ రైస్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఆర్‌ఆర్‌ఐ) సైంటిస్ట్‌ డాక్టర్‌ స్వాతి నాయక్ నార్మన్‌ ఈ బోర్లాగ్‌ అవార్డుకు ఎంపికయ్యారు. క్షేత్రస్థాయి పరిశోధనలో ఆమె కృషికి గుర్తింపుగా 2023వ సంవత్సరానికి ఆమెకు ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్లు వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ ఫౌండేషన్‌ తన అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్) అకౌంట్ ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా ఆమెను “అత్యుత్తమ యువ శాస్త్రవేత్తగా” పేర్కొంటూ ఈ అవార్డును అందించనుంది ఈ సంస్థ. స్వాతి నాయక్ న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఆర్‌ఆర్‌ఐ)లో విత్తన వ్యవస్థ, ఉత్పత్తి నిర్వహణకు దక్షిణాసియా లీడ్‌గా పనిచేస్తున్నారు. వరిపంట సాగు చేస్తున్న చిన్న రైతులకు అందించిన సేవలకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది.

నోబెల్ అవార్డు గ్రహీత, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ నార్మన్ బోర్లాగ్ జ్ఞాపకార్థం 40 ఏళ్లలోపు వయసు ఉన్న అసాధారణ శాస్త్రవేత్తలకు, ఆహారం, పోషకాహార భద్రత, ఆకలి నిర్మూలన రంగంలో పనిచేస్తున్న వారికి ఈ అవార్డు ఇవ్వబడుతుంది.




ఈ విషయమై స్పందించిన స్వాతి ఫీల్డ్ సైంటిస్ట్‌గా తన ప్రయత్నాలను, పనిని ఈ అవార్డు మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఆమె 500 కంటే ఎక్కువ వరి రకాల కోసం 10,000 కంటే ఎక్కువ విస్తృతమైన ఆన్-ఫార్మ్ పరీక్షలను నిర్వహించారు. ఆసియా మరియు ఆఫ్రికా అంతటా వివిధ దేశాల్లోని విభిన్న పర్యావరణ వ్యవస్థల్లో ఈ ట్రయల్స్‌ని అమలు చేయడం కోసం వేలాది మంది చిన్న రైతులతో కలిసి పనిచేశారు.

స్వాతి ఈ అవార్డు సాధించిన మూడవ భారతీయ వ్యక్తిగా, మొదటి ఒడిశా ప్రతినిధిగా రికార్డుకెక్కారు. అమెరికాలోని డెస్ మోయినెస్‌లో అక్టోబర్ 24, 26 తేదీల్లో 2023 నార్మన్ ఇ బోర్లాగ్ అంతర్జాతీయ సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును స్వాతినాయక్ అందుకుంటారు.

*

First Published:  22 Sep 2023 4:55 AM GMT
Next Story