Telugu Global
Sports

కామన్వెల్త్ చివరి రోజు నాలుగు స్వర్ణాలతో దుమ్ము రేపిన భారత్

బర్మింగ్‌హామ్ కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలను గెలుచుకొని పతకాల పట్టికలో నాల్గవ స్థానంలో నిలిచింది. ఈ రోజు ఒక్క రోజే భారత్ నాలుగు స్వర్ణ పతకాలను గెల్చింది.

కామన్వెల్త్ చివరి రోజు నాలుగు స్వర్ణాలతో దుమ్ము రేపిన భారత్
X

కామన్ వెల్త్ గేమ్స్ చివరి రోజైన ఇవ్వాళ్ళ భారత బృందం ఐదు స్వర్ణ పతకాలలో నాలుగింటిని కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌లో జరిగిన బర్మింగ్‌హామ్ 2022 కామన్వెల్త్ గేమ్స్ లో మొత్తం పతకాల పట్టికలో నాల్గవ స్థానంలో నిలిచింది. 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలను గెలుచుకున్న భారత జట్టు మొత్తం 61 పతకాలను సాధించింది.

బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు

గతంలో 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్యం, 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించిన ఏస్ ప్లేయర్ పీవీ సింధు చివరకు బర్మింగ్‌హామ్ 2022 కామన్వెల్త్ లో స్వర్ణం గెలుచుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్‌లో కెనడా క్రీడాకారిణి మిచెల్ లీపై వరుస సెట్లలో విజయం సాధించింది.

మూడు సెట్ల థ్రిల్లర్‌లో మలేషియాకు చెందిన ట్జే యోంగ్ ఎన్‌జిని ఓడించి తన మొట్టమొదటి కామన్‌వెల్త్ గేమ్స్‌లో లక్ష్య సేన్ కూడా స్వర్ణం సాధించాడు.

పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సియారాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ కూడా స్వర్ణం సాధించింది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ బ్యాడ్మింటన్‌ ఈవెంట్‌లో తొలిసారిగా భారత్‌ పురుషుల డబుల్స్‌ స్వర్ణం సాధించింది. ఇంగ్లండ్ ద్వయం బెన్ లెన్-సీన్‌ వెండీలపై 21-15, 21‍ -13 తో రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ విజయం సాధించింది.

పురుషుల టేబుల్ టెన్నిస్‌లో 40 ఏళ్ల ఆచంట శరత్ కమల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ ఆటగాడు లియామ్ పిచ్‌ఫోర్డ్‌తో 4-1తో విజయం సాధించి స్వర్ణం గెలుచుకున్నాడు. దీంతో చివరి రోజు భారత్‌కు నాలుగు స్వర్ణాలు లభించాయి.

First Published:  8 Aug 2022 3:45 PM GMT
Next Story