Telugu Global
National

రాష్ట్ర వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తోన్న మోడీ-షా 'వన్ ఇండియా' విధానం

బీజేపీ ఇస్తున్న‌ డబుల్ ఇంజన్ సర్కార్ నినాదం రాష్ట్రాల హక్కులను కాలరాయడానికేనా ? ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటున్న కేంద్రం రాష్ట్రాలను భయపెట్టాలని చూస్తోందని, చివరకు రాష్ట్రాల పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్య చేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తోన్న మోడీ-షా వన్ ఇండియా విధానం
X

ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల్లో తమకు ముప్పు ఉందని భావించినప్పుడు సిబిఐ, ఇడి వంటి సంస్థలేగాక‌ సిఆర్‌పిఎఫ్, సిఐఎస్‌ఎఫ్ సిబ్బందిని కూడా బిజెపి ప్ర‌యోగించ‌డానికి వెన‌కాడ‌బోద‌ని సీనియ‌ర్ విశ్లేష‌కులు భావిస్తున్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రాల‌లోనూ ఒకే ప్ర‌భుత్వం ఉండాలంటూ రాష్ట్రాలు తాను ఆడించిన‌ట్టు ఆడాల‌న్న ఉద్దేశంతో 'డ‌బుల్ ఇంజ‌న్ విధానం' పేరిట మోడీ-షా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ ఆలోచ‌న‌ల‌తో రాష్ట్రాల పోలీసుల మ‌నోస్ఠ‌యిర్యం దెబ్బ‌తింటోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

నేషనల్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరోతో సహా అన్ని ముఖ్యమైన నేర పరిశోధనలను ఈడీ, సీబీఐ, ఎన్‌ఐఏ వంటి కేంద్ర ఏజెన్సీల చేతుల్లో పెట్ట‌డం ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంద‌ని మ‌హారాష్ట్ర మాజీ డిజిపి డి.శివానంద‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇది ఎన్నో క్లిష్ట‌మైన కేసుల‌ను కూడా ప‌రిష్క‌రించ‌గ‌ల సామ‌ర్ధ్యం ఉన్న రాష్ట్రాల పోలీసు వ్య‌వ‌స్థ‌ల‌ను, వారి నైతిక బ‌లాన్ని అగౌర‌వ‌ప‌ర్చ‌డం, నిర్వీర్య‌ప‌ర్చ‌డ‌మే . ప్ర‌జ‌ల ఆలోచనలు,మ‌నోభావాలను అన్నింటినీ నియంత్రించే ఒక పార్టీ ఆధ్వర్యంలో 'ఐక్యత', 'ఏక భారతదేశం' స్థాపించాలని వారు నిశ్చయించుకున్నారు! దేశానికి, ప్రజలకు ఏది మంచిదో వారికి మాత్రమే తెలుసున‌ని భావిస్తున్నారు.

రాష్ట్రాల‌ను ఆక్ర‌మించుకోవ‌డంలోనే గాక విప‌క్ష ప్ర‌భుత్వాల రాష్ట్రాల‌లో పోలీసు వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని విశ్లేష‌కుడు జులియో రిబిరో అభిప్రాయ‌ప‌డ్డారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసిన సగానికి పైగా ఓటర్లు మోడీకి, బీజేపీకి ఓటు వేయలేదు. ఆయన చేసిన 'సబ్ కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్' నినాదాన్ని మొత్తం జనాభాలో దాదాపు 14శాతం ఉన్న మైనారిటీ కమ్యూనిటీ సీరియ‌స్ గా తీసుకోలేదు. ప్రతి భారతీయుడి శ్రేయస్సును బిజెపి నిజంగా కోరుకుంటుందని మెజారిటీ కమ్యూనిటీ లో కూడా చాలామందికి న‌మ్మ‌కం లేదు. ఉదాహరణకు దేశంలోని చాలా ప్రాంతాల్లో దళితులలో తమను సమానంగా ఆద‌రించ‌డంలేద‌నే ఆవేదన వ్యక్తం మ‌వుతూనే ఉంది. గుజరాత్‌లో ఓబిసి పిల్లలు కూడా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కింద దళితులు వండిన ఆహారాన్ని తిరస్కరించినట్లు వార్త‌లు వ‌చ్చాయి. పెండ్లి ఊరేగింపుల్లో గుర్రం ఎక్కేందుకు ధైర్యం చేస్తే దళిత పెళ్ళి కొడుకుల‌ను కొట్టారు. దళిత యువకులు అగ్ర‌' కులాలతో సమానంగా ఉండాల‌ని ప్ర‌య‌త్నిస్తే వారిని కూడా కొట్టి హింసిస్తారు. గుజరాత్‌లో ఇది సాధారణ‌మే. ఉత్త‌రాదిన బీజేపీ ఆధిపత్యం ఉన్న వెనుకబడిన ఇత‌ర రాష్ట్రాల్లో ఇంత‌కంటే ఇంకేమి ఆశించగ‌లం?

బ్రాహ్మణీయ చాతుర్వర్ణ‌ వ్య‌వ‌వ‌స్థ‌ను తిరిగి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంద‌ని మైనారిటీలలోనూ, మెజారిటీవ‌ర్గాల్లో నిర్లక్ష్యానికి గురైన వారిలో ఉన్న వాస్త‌వ భావన. ఇది పూర్తిగా నిజం కాకపోవచ్చు, కానీ ఆ వ‌ర్గాల్లో వినిపిస్తున్న అభిప్రాయాలు అవ‌గాహ‌న‌లు అలాగే ఉన్నాయ‌. 'నూతన భారతదేశంలో' పాత సామాజిక వ్యవస్థను పునరుద్ధరించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని చాలా మంది హిందూ అగ్ర‌కులాలు భావిస్తున్నాయి. .

పోలీస్ వ్య‌వ‌స్థ నిర్వీర్యం ఇలా..!

కేంద్ర దర్యాప్తు సంస్థలు కొత్త పాత్ర పోషిస్తున్నందున పోలీసు బలగాలలో స్థైర్యం స‌న్న‌గిల్లి నిర్లిప్త‌త ఆవ‌రిస్తోంద‌ని శివానందన్ అభిప్రాయం సరైనదేన‌నిపిస్తుంది. స్ప‌ష్టంగా చెప్పాలంటే ఇది ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం జ‌రుగుతోంది. అన్ని అధికారాలు ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం(పిఎంఓ) వ‌ద్ద కేంద్రీకరించబడాలని కోరుకుంటున్నారు. అంటే రాష్ట్రాల పోలీసు వ్య‌వ‌స్థ కేవ‌లం శాంతి భ‌ద్ర‌త‌ల‌నిర్వ‌హ‌ణ‌కే ప‌రిమిత‌మ‌య్యేలా చేస్తున్నారు. అంటే వారు లా అండ్ ఆర్డర్ మేనేజ్‌మెంట్‌లోను, రాష్ట్ర ప్రభుత్వ పాత్రను కేంద్ర‌ విధానాలను అమలు చేయడానికే పరిమితం చేయాల‌నేది ఆలోచ‌న‌. ఉదాహరణకు, వారి వారి విధానాలను వ్యతిరేకించే వారిపై మాత్ర‌మే 'బుల్‌డోజర్‌లను' ఉపయోగించాలి అన్న ఉద్దేశం కేంద్రంలో క‌న‌బ‌డుతుంది.

డ‌బుల్ ఇంజ‌న్ క‌ల !

హిందూ తీవ్రవాదులకు ఎప్పుడూ ఒకే అధికార కేంద్రం ఉండాలనేది కల. త‌మ సూచనలను, ఆలోచ‌న‌ల‌ను అనుసరించడానికి ప్రతి రాష్ట్రంలోనూ ఉండాల‌నుకునే 'డ‌బుల్ ఇంజ‌న్' పాత్ర ఇదే. ఈ క్ర‌మంలోనే డబ్బు, బలం, ఈడి,సిబిఐ వంటి వాటితో బెదిరింపులు. విప‌క్ష ప్ర‌భుత్వాల‌ను ప‌డ‌గొట్టి బిజెపి ప్రభుత్వాలను 'డబుల్ ఇంజిన్' పేరుతో అధికారంలోకి తేవ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తోంది. ఇందులో క‌లిసివ‌చ్చే రాజ‌కీయ నాయ‌కుల‌కు ప్ర‌తిఫ‌లంగా ప‌ద‌వులు, డ‌బ్బ‌లు వంటివి ఎర‌వేస్తున్నారు.

హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉండే కేంద్ర సాయుధ బలగాలను కూడా అదే లక్ష్యంతో ఉపయోగించుకోవాలనే ఆలోచన కూడా కేంద్ర ప్ర‌భుత్వానికి ఉన్న‌ట్టు క‌న‌బ‌డుతుంది. ఎందుకంటే .. పశ్చిమ బెంగాల్ వంటి ప్రతిపక్షాల నియంత్రణలో ఉన్న రాష్ట్రాలలో బిజెపి ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఇబ్బందులు ఎదురైన‌ట్టు భావించినప్పుడల్లా, సిఆర్పీఎఫ్‌,సిఐఎఫ్ సిబ్బందిని రాష్ట్రానికి పంపడం కేంద్రం వైఖ‌రికి నిద‌ర్శ‌నం. మ‌హారాష్ట్ర లో ఏక్ నాథ్ షిండే ప్ర‌భుత్వం ఏర్ప‌డే ముందు త‌మ తిరుగుబాటు ఎమ్మెల్యేల‌కు కేంద్ర బ‌ల‌గాలు భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని కేంద్రాన్ని కోరడం గ‌మ‌నార్హం. పారా-మిలటరీ, హోం మంత్రిత్వ శాఖలు ప్రతిపక్ష రాష్ట్రాలలోకి ఇలా కొత్త అవ‌తారంలో ప్రవేశించడం మొద‌లైతే డ‌బుల్ ఇంజ‌న్ ప్రారంభానికి నాంది అని గ్ర‌హించాలి.

First Published:  22 Aug 2022 6:14 AM GMT
Next Story