Telugu Global
National

ఆ 11 మంది రేపిస్టులను సన్మానించిన RSS, VHP

11 మంది రేపిస్టులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతుంటే ఆరెస్సెస్, వీహెచ్ పీ లు మాత్రం వారికి సన్మానాలు చేస్తోంది.

ఆ 11 మంది రేపిస్టులను సన్మానించిన RSS, VHP
X

గుజరాత్ మత దాడుల సమయంలో బిల్కీస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారం, ఆమె ఏడుగురు కుటుంబ సభ్యులను దారుణంగా హత్య చేసిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న 11 మంది నేరస్తులను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుజరాత్ ప్రభుత్వ విడుదల చేసిన విషయం తెలిసిందే.

రేపిస్టులను విడుదల చేయడం పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. విపక్షాలు బీజేపీ సర్కార్ పై మండి పడుతున్నాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా రేపిస్టుల విడుదలను తప్పుపట్టారు. గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు కూడా. రాహుల్ గాంధీ తో సహా, ఇతర విపక్ష నేతలు కూడా ఇదే డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషద్ , బీజేపీ నాయకులు ఆ రేపిస్టులకు మద్దతుపలుకుతున్నారు. వాళ్ళకు సన్మానాలు చేస్తున్నారు.

స్క్రోల్ వెబ్ సైట్ కథనం ప్రకారం... దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ట్రస్ట్ యొక్క ఆడిటోరియంలో ఆరెస్సెస్ ఈ 11 మందికి సన్మానం చేసింది. ఆరెస్సెస్ నాయకుడు అరవింద్ సిసోడియా ఆ11 మంది రేపిస్టులకు పూల మాలలు వేసి స్వీట్లు తినిపించారు.

విశ్వహిందూ పరిషత్ కూడా ఈ 11 మంది రేపిస్టులను సన్మానించిందని 'టైమ్స్ నౌ' పేర్కొంది. ''విశ్వహిందూ పరిషత్ (VHP) బుధవారం గుజరాత్‌లోని తన కార్యాలయంలో బిల్కిస్ బానో అత్యాచారం కేసులో విడుదలైన దోషులకు పూలమాల వేసి స్వాగతం పలికింది. దోషులు దండలు వేసి విహెచ్‌పి సభ్యులు అభివాదం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వెలువడ్డాయి.'' అని 'టైమ్స్ నౌ కథనం పేర్కొంది.

పైగా విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ ఇండియా టుడే ఛానల్ లో మాట్లాడుతూ ఆ 11 మందిని రేపిస్టులు అనడాన్ని తప్పుబట్టారు. వాళ్ళను సన్మానించడం, వాళ్ళకు స్వీట్లు తినిపించడం తప్పు కాదని వాదించారు.

ఇక ఈ 11మంది నేరస్తుల గ్రామమైన దాహోద్ జిల్లాలోని రంధిక్‌పూర్ లో హిందుత్వ గ్రూపులు చేస్తున్న హడావుడి మామూలుగా లేదు. స్థానిక ప్రజలు కూడా ఈ 11 మంది ఇంటికి బారులు తీరారు. వాళ్ళకు తిలకాలు దిద్దుతూ , పూలమాలలు వేస్తూ సన్మానాలు చేస్తున్నారు.

వీళ్ళందరికీ నాయకుడైన 47 ఏళ్ల రాధేశ్యామ్ షా నివాసమైతే రోజూ కిటకిటలాడుతూ ఉంది. షా తో మీడియా మాట్లాడినప్పుడు ఆయన బిల్కిస్ బానో కుటుంబం తనకు బాగా తెలుసునని చెప్పారు.

"ఆమె తల్లిదండ్రులు ఇక్కడ నివసించేవారు, మేము ఆమె సోదరుడితో క్రికెట్ ఆడేవాళ్ళం, నాకు ఆమె భర్త కూడా తెలుసు." అని అతను చెప్పాడు.

అయితే బానో పై అత్యాచారం గురించి అడిగినప్పుడు అతను కంగారుపడ్డాడు. "నాకు ఆమె గురించి పెద్దగా తెలియదు," అని చెప్పాడు.

సోమవారం జైలు నుంచి విడుదలైన తర్వాత, "స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో" జైలు నుండి నేరుగా ఇంటికి వచ్చానని షా పేర్కొన్నారు. తనను, అతని తోటి దోషులను ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషద్ గ్రూపుల సభ్యులు సత్కరించినట్లు చూపించే చిత్రాల గురించి అడిగినప్పుడు, అతను 18 సంవత్సరాలుగా జైలులో ఉన్నానని, అందువల్ల‌ తనను కలిసిన వాళ్ళ గురించి తనకు తెలియదని, అలాగే తమకు సన్మానం చేసిందెవరో కూడా తనకు తెలియదని చెప్పాడు. కానీ తాను హిందుత్వ భావజాలంతో ఉన్న విషయాలు మాత్రం పరోక్షంగా చెప్పారు.

తాను ముస్లింలనుండి మహిళలను, బాలికలను రక్షించానని చెప్పాడు. 2000 సంవత్సరంలో ముస్లిం పురుషులతో కలిసి పారిపోయిన ఆదివాసీ బాలికలను తిరిగి తీసుకురావడానికి" తాను సహాయం చేశానని చెప్పాడు. "నేను కోర్టులో కేసు వేశాను," అని అతను చెప్పాడు. పైగా తాని లవ్ జీహాదీని ఆపానన్నారు. బలవంతంగా మతం మార్చిన ఆ బాలికలను మళ్ళీ మతంలోకి తీసుకొచ్చాను అని గర్వంగా చెప్పారు షా.

షాతో సహా రేపిస్టులైన ఈ 11 మందిలో ఎక్కడా తాము చేసిన పనికి పశ్చాత్తాపం కనిపించలేదు. తాము అమాయకులం అని పైకి చెప్తున్నప్పటికీ వాళ్ళు చేసిన పని సరైనదే అనే అభిప్రాయంతో వాళ్ళు ఉన్నారు. అంతే కాదు ఆ గ్రామస్తులు కూడా వీళ్ళు చేసిన పనిని సమర్దించేట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ మనసుల్లో మస్లింలపై విషం నిండి ఉంది. వీళ్ళంతా అనుసరిస్తున్న ఆరెస్సెస్, విశ్వహిందూ పరిషద్ లే ఈ రేపిస్టులకు సన్మానాలు చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం మారో మార్గంలో ఎందుకు నడుస్తారు.



First Published:  18 Aug 2022 7:30 AM GMT
Next Story