Telugu Global
National

ఢిల్లీ అంజలీ సింగ్ మృతి కేసులో నిందితులు 5గురు కాదు మరో ఇద్దరున్నారు... వెల్లడించిన పోలీసులు

"కస్టడీలో ఉన్న ఐదుగురితో పాటు మరో ఇద్దరు ఈ సంఘటన‌లో పాల్గొన్నారు. దానికి సంబంధించి మా వద్ద శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. వారిద్దరి నేరాన్ని కప్పి పిచ్చడానికి మిగతా వారు ప్రయత్నించారు" అని సీనియర్ పోలీసు అధికారి సాగర్‌ప్రీత్ హుడా చెప్పారు.

ఢిల్లీ అంజలీ సింగ్ మృతి కేసులో నిందితులు 5గురు కాదు మరో ఇద్దరున్నారు... వెల్లడించిన పోలీసులు
X

న్యూ ఇయర్ తెల్లవారుజామున 20 ఏళ్ల యువతి అంజలీ సింగ్ ను కారుతో గుద్ది 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి ఆమె మరణానికి కారణమైన కేసులో మరో ఇద్దరు అనుమానితులు బయటపడ్డారు.

వారిలో ఒకరు కారు యజమాని అశుతోష్ కాగా మరొకరు నిందితులలో ఒకరి సోదరుడు అంకుష్ అని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు ఈ రోజు తెలిపారు.

"కస్టడీలో ఉన్న ఐదుగురితో పాటు మరో ఇద్దరు ఈ సంఘటన‌లో పాల్గొన్నారు. దానికి సంబంధించి మా వద్ద శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. వారిద్దరి నేరాన్ని కప్పి పిచ్చడానికి మిగతా వారు ప్రయత్నించారు" అని సీనియర్ పోలీసు అధికారి సాగర్‌ప్రీత్ హుడా చెప్పారు.

ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత అరెస్టయిన వారిలో దీపక్ ఖన్నా, మనోజ్ మిట్టల్, అమిత్ ఖన్నా, క్రిషన్, మిథున్ లు ఉన్నారు.

గతంలో అనుకున్నట్లుగా కారు నడిపింది దీపక్ ఖన్నా కాద‌ని, అమిత్ ఖన్నా కారు నడుపాడని దర్యాప్తులో తేలింది. అమిత్‌కు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని హుడా చెప్పారు.

" నిందితులు చెప్తున్న దానికి జరిగినదానికి తేడా ఉంది. సిసిటివి ఫుటేజీ ఆధారంగా నిందితుల వాదనలు అబద్దమని మేము నిర్దారణకు వచ్చాము " అని హుడా చెప్పాడు, నిందితులకు, బాధితురాలికి మధ్య ఎటువంటి సంబంధం లేదని కూడా ఆయన అన్నారు.

''నేరాన్ని కప్పిపుచ్చేందుకు నిందితులు కుట్ర పన్నారు. ఇది చాలా భయంకరమైన సంఘటన. మేము సాక్ష్యాలను సేకరించడానికి ప్రయత్నిస్తున్నాము. అంజలికి తప్పకుండా న్యాయం జరుగుతుంది.'' అని హుడా చెప్పారు.

కాగా నూతన సంవత్సరం రోజు అంజలి సింగ్ తన స్నేహితురాలు నిధితో కలిసి స్కూటర్‌పై వెళుతుండగా, తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో నిందితుల‌ కారు ఆమెను ఢీకొట్టింది. అంజలి కాలు కారు చక్రంలో ఇరుక్కపోయి ఆమెను ఈడ్చుకెళ్లింది. ఆమె అరిచింది కానీ కారు ఆగలేదు. చక్రాల కింద ఆమె ఉన్నట్టు వాళ్ళకు అర్దమైనప్పటికీ వారు కారును ఆపలేదు. దాదాపు గంటకు పైగా కారును డ్రైవ్ చేస్తూనే ఉన్నారు.

నిందితులు కారును తిరిగి దాని యజమాని అశుతోష్ వద్దకు తీసుకువచ్చి అక్కడ వదిలేసి, ఆటోరిక్షాలో పారిపోయినట్లు సెక్యూరిటీ ఫుటేజీ వెల్లడించింది.

రోహిణిలోని సిసిటివి ఫుటేజీలో నిందితులు తెల్లవారుజామున 4.33 గంటలకు కారును ఒక ప్లేస్ లో ఆపి, వేచి ఉన్న ఆటోరిక్షాలో వెళ్ళిపోయినట్టు రికార్డ్ అయ్యింది.

First Published:  5 Jan 2023 12:33 PM GMT
Next Story