Telugu Global
National

అవును.. ఆ కలెక్టర్లిద్దరూ ఇష్టపడ్డారు

విడాకులతో విడిపోయిన జంటల్లో ఇద్దరు ఇప్పుడు తిరిగి పెళ్లి చేసుకోవాలనుకోవడం విశేషం. జీవిత భాగస్వాములతో విడిపోయిన తర్వాత వీరిద్దరూ మరోసారి ప్రేమలో పడటం మరింత విశేషం.

అవును.. ఆ కలెక్టర్లిద్దరూ ఇష్టపడ్డారు
X

ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ప్రేమ వివాహం చేసుకోవడం సహజమే. ట్రైనింగ్ సమయంలో ప్రేమలో పడి పోస్టింగ్ వచ్చే నాటికి జంటలుగా మారినవారు చాలామంది ఉన్నారు. విధుల్లో చేరిన తర్వాత కొత్తగా ప్రేమకథ మొదలైతే మాత్రం అది విశేషమేనని చెప్పాలి. అలాంటి విశేషం ఒడిశాలో జరిగింది. ఒడిశాకు చెందిన ఇద్దరు కలెక్టర్ల వివాహం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. వారిద్దరూ ఒడిశాలోని రెండు జిల్లాలకు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రేమలో పడ్డారు. చివరకు పెద్దవారి అనుమతితో వారిద్దరూ ఒకటి కాబోతున్నారు. ఈనెల 15న పూరీ కలెక్టర్ సమర్థ వర్మ, రాయగఢ కలెక్టర్ స్వాధా దేవ్ సింగ్ పెళ్లిపీటలెక్కుతారు.

అంతేనా..?

అంతేనా అంటే ఈ ప్రేమ కథలో ఇంకో ఇంట్రస్టింగ్ పాయింట్ కూడా ఉంది. వీరిద్దరి తొలి వివాహాలు ఫెయిలయ్యాయి. స్వాధాదేవ్‌ సింగ్‌ కొంతకాలం క్రితం బొలంగీర్‌ కలెక్టర్‌ చంచల రాణాను పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వెంటనే విడాకులు తీసుకున్నారు. విడివిడిగా జీవిస్తున్న క్రమంలో ఇటీవల స్వాధా దేవ్ సింగ్.. సమర్థ వర్మను ఇష్టపడ్డారు. పూరీ కలెక్టర్ సమర్థ వర్మకు కూడా మరో శాడ్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. సమర్థవర్మ ఇంతకు ముందు రైల్వే అధికారిణి సుచిసింగ్‌ ను పెళ్లి చేసుకున్నారు. వీరి మధ్య కూడా మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత ఆయన స్వాధా దేవ్ సింగ్ పై మనసు పడ్డారు. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. స్వాధా దేవ్ సింగ్ మాజీ భర్త చంచల రాణా ఇటీవలే మరో ఐఏఎస్ అధికారిణి అనన్య దాస్ ని పెళ్లి చేసుకున్నారు.

విడాకులతో విడిపోయిన జంటల్లో ఇద్దరు ఇప్పుడు తిరిగి పెళ్లి చేసుకోవాలనుకోవడం విశేషం. జీవిత భాగస్వాములతో విడిపోయిన తర్వాత వీరిద్దరూ మరోసారి ప్రేమలో పడటం మరింత విశేషం. వీరి ప్రేమ వ్యవహారానికి పెద్దలు అంగీకారం తెలపడంతో ఇరు కుటుంబాల సమక్షంలోనే ఈ ప్రేమ పెళ్లి జరగబోతోంది. రెండు జిల్లాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఈ పెళ్లిలో సందడి చేయబోతున్నారు.

First Published:  7 May 2023 7:09 AM GMT
Next Story