Telugu Global
National

వరుణ్ గాంధీతో నాకు కుదరదు, ఆయన భావజాలంతో నాకు పడదు -రాహుల్ గాంధీ

''వరుణ్ గాంధీ బిజెపిలో ఉన్నారు, అతను భారత్ జోడో యాత్రలో నడిస్తే అది అతనికి సమస్య కావచ్చు. నా భావజాలం అతని భావజాలంతో సరిపోదు. నేను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యాలయానికి ఎప్పటికీ వెళ్ళలేను. అక్కడికి వెళ్ళాలంటే నేను ముందు నా తల నరికేసుకోవల్సి ఉంటుంది.'' అని రాహుల్ గాంధీ అన్నారు.

వరుణ్ గాంధీతో నాకు కుదరదు, ఆయన భావజాలంతో నాకు పడదు -రాహుల్ గాంధీ
X

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ చాలా కాలంగా ఆయన స్వంత పార్టీకి వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లో చేరతాడన్న ఊహాగానాలు వినవస్తున్నాయి. అయితే ఆ విషయంపై రాహుల్ గాంధీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తమిద్దరివి రెండు భిన్నమైన సిద్ధాంతాలని, వరుణ్ గాంధీ స్వీకరించిన సిద్ధాంతాన్ని తాను అంగీకరించలేనని అన్నారు. పంజాబ్‌లో తన భారత్ జోడో యాత్ర సందర్భంగా విలేకరుల సమావేశంలో రాహుల్ మాట్లాడుతూ, "నేను అతనిని కలవగలను, కౌగిలించుకోగలను, కానీ నేను ఆ భావజాలాన్ని అంగీకరించలేను" అని అన్నారు.

భారత్ జోడో యాత్రలో వరుణ్ గాంధీ పాల్గొంటారనే వార్తల పై రాహుల్ స్పంధిస్తూ...

“వరుణ్ గాంధీ బిజెపిలో ఉన్నారు, అతను భారత్ జోడో యాత్రలో నడిస్తే అది అతనికి సమస్య కావచ్చు. నా భావజాలం అతని భావజాలంతో సరిపోదు. నేను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యాలయానికి ఎప్పటికీ వెళ్ళలేను. అక్కడికి వెళ్ళాలంటే నేను ముందు నా తల నరికేసుకోవల్సి ఉంటుంది. నా కుటుంబానికి ఒక ఐడియాలజీ ఉంది. వరుణ్ మరొక భావజాలాన్ని స్వీకరించాడు. నేను ఆ భావజాలాన్ని అంగీకరించలేను. నేను అతనిని కలవగలను, కౌగిలించుకోగలను కానీ ఆ భావజాలాన్ని అంగీకరించలేను'' అని రాహుల్ విలేకరులతో అన్నారు.

సంజయ్ గాంధీ, మేనకా గాంధీల కుమారుడు వరుణ్ గాంధీ పిలిభిత్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు.

దేశంలోని అన్ని వ్యవస్థ‌లపై ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ చేస్తున్న ఒత్తిడిపై కూడా రాహుల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఈరోజు దేశంలోని అన్ని వ్య్వస్థ‌లను ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ నియంత్రిస్తున్నాయి. అన్ని సంస్థలపై ఒత్తిడి ఉంది. మీడియా ఒత్తిడిలో ఉంది, బ్యూరోక్రసీ ఒత్తిడిలో ఉంది, ఎన్నికల సంఘం ఒత్తిడిలో ఉంది, వారు న్యాయవ్యవస్థపై కూడా ఒత్తిడి తెచ్చారు, ”అని అన్నారు.

‘‘ఇది ఒక రాజకీయ పార్టీకి, మరో రాజకీయ పార్టీకి మధ్య జరుగుతున్న పోరాటం కాదు. ఇది ఇప్పుడు దేశంలోని వారు కబ్జా చేసిన వ్యవస్థ‌లకు, ప్రతిపక్షాలకు మధ్య పోరు’’ అని రాహుల్ అన్నారు.

భారత్ జోడో యాత్ర మంగళవారం హోషియార్‌పూర్ జిల్లాలోని తండా నుండి తిరిగి ప్రారంభమైంది ఈ సాయంత్రానికి ముకేరియన్‌కు చేరుకోనుంది.

First Published:  17 Jan 2023 11:50 AM GMT
Next Story