Telugu Global
National

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల విలువ లెక్కింపు ఎలా చేస్తారంటే..

ఎంపీల ఓటింగ్‌ పార్లమెంట్‌ హౌస్‌లో జరుగుతుంది. ఎమ్మెల్యేలు వారివారి రాష్ట్ర అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటారు.

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల విలువ లెక్కింపు ఎలా చేస్తారంటే..
X

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ సోమవారం ఉదయం 10 నుంచి జరుగుతోంది. దేశంలోని 4వేల 33 మంది ఎమ్మెల్యేలు, లోక్‌సభ సభ్యులు 543 మంది, రాజ్యసభ సభ్యులు 233 మంది రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎంపీల ఓటింగ్‌ పార్లమెంట్‌ హౌస్‌లో జరుగుతుంది. ఎమ్మెల్యేలు వారివారి రాష్ట్ర అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రస్తుతం బరిలో ఎన్‌డీఏ తరఫున ద్రౌపది ముర్ము, విపక్ష అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉన్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేల ఓటు విలువ ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీలుగా ఓటు విలువ లెక్కిస్తారు. దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 10 లక్షల 86వేల 431. పార్లమెంట్, అసెంబ్లీల్లో నామినేట్ చేయబడిన సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఎమ్మెల్సీలకు కూడా ఓటు వేసే అవకాశం లేదు.

ఎమ్మెల్యేల ఓట్ల విలువను 1971 నాటి జనాభా లెక్కల ప్రకారం ప్రతి రాష్ట్రానికి వేరువేరుగా లెక్కిస్తారు. 1971 లెక్కల ప్రకారం నాటి రాష్ట్ర జనాభాను.. ఎమ్మెల్యేల సంఖ్యను వెయ్యితో గుణించగా వచ్చిన సంఖ్యతో భాగిస్తారు. ఉదాహరణకు 1971 లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 1,57,02,122. ప్రస్తుతం తెలంగాణలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 119. ఈ 119ని వెయ్యిలో గుణిస్తే వచ్చే సంఖ్య- 119000. మొత్తం జనాభా సంఖ్య 1,57,02,122ను 119000తో భాగిస్తే వచ్చే సంఖ్య- 132. అంటే తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 132. తెలంగాణలో మొత్తం ఎమ్మెల్యేలందరి ఓటు విలువ కలిపితే 15వేల 708గా ఉంది.


ఎంపీల ఓట్ల లెక్కింపు విధానం..

మొత్తం ఎంపీల సంఖ్య 776

ఒక్కో ఎంపీ ఓటు విలువ దేశంలో 700. రాష్ట్రపతి ఎన్నికల్లో విప్‌ జారీ ఉండదు. సభ్యులు స్వేచ్చగా నచ్చిన వారికి ఓటు వేయవచ్చు.

First Published:  18 July 2022 12:30 AM GMT
Next Story