Telugu Global
National

ఇకపై కింది స్థాయి కోర్టుల్లోనూ అత్యున్నత సాంకేతికత : సీజేఐ జస్టిస్ చంద్రచూడ్

న్యాయస్థానాలను టెక్-ఫ్రెండ్లీగా మార్చాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు.

ఇకపై కింది స్థాయి కోర్టుల్లోనూ అత్యున్నత సాంకేతికత : సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
X

ఇండియాలోని కోర్టులు ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకోవల్సిన అవసరం గురించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడు తన అభిప్రాయాన్నిచెప్పారు. భారత అత్యున్నత న్యాయస్థానంలో ఎలాగైతే సాంకేతికను ఉపయోగిస్తున్నారో.. రాబోయే రోజుల్లో కింది స్థాయి కోర్టుల్లో కూడా అలాంటి సాంకేతికను వినియోగించేలా చర్యలు తీసుకుంటామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు.

ఆర్టికల్ 370 రద్దుపై విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాలను టెక్-ఫ్రెండ్లీగా మార్చాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. ఆర్టికల్ 370 రద్దుపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ సమయంలో సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. కింది కోర్టులు కూడా సాంకేతికను అందిపుచ్చుకోవల్సిన అవసరం ఉందని సూచించారు. దీనిపై సీజేఐ చంద్రచూడ్ స్పందించారు.

ఇప్పటికే కోర్టుల్లో సాంకేతికను మెరుగు పరిచే దిశగా చర్యలు ప్రారంభించామని అన్నారు. ఈ-కోర్టుల ప్రాజెక్ట్ 3వ దశ కోసం భారీగా బడ్జెట్ కేటాయించినట్లు భారత ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. సాంకేతికతతో న్యాయ వ్యవస్థను సన్నద్దం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో అన్ని వ్యవస్థలు స్తంభించిపోయినా న్యాయస్థానాలను ప్రతీ రోజు నడపాల్సి వచ్చిందని అన్నారు.

ఈ-కోర్టుల ప్రాజెక్టు మూడో దశ కోసం కేంద్రం కేటాయించిన బడ్జెట్‌తో కింది కోర్టుల్లో సాంకేతికత పుంజుకుంటుందని చెప్పారు. న్యాయస్థానాలకు అవసరమైన డిజిటల్ సదుపాయాల కల్పనకు నిధులు సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కూడా ముఖ్యమైనదని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఈ-కోర్టుల మూడో దశ కోసం కేంద్రం రూ.7వేల కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. వీడియో కాన్ఫరెర్స్ కోసం మా స్వంత క్లౌడ్ సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందిస్తున్నట్లు సీజేఐ పేర్కొన్నారు.

First Published:  18 Aug 2023 2:54 AM GMT
Next Story