Telugu Global
National

అయోధ్య రాముడికి 'హనుమాన్' టీమ్ విరాళం

సంక్రాంతి సందర్భంగా జనవరి 12న 'హనుమాన్' సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నార్త్ ఇండియా, విదేశాల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది.

అయోధ్య రాముడికి హనుమాన్ టీమ్ విరాళం
X

అయోధ్య రామ మందిరానికి 'హనుమాన్' చిత్ర యూనిట్ విరాళం ప్రకటించింది. ఈ సినిమా ప్రతి టికెట్‌పై రూ.5ను అయోధ్య రామాలయానికి విరాళంగా ఇస్తామని చిత్ర బృందం ప్రీ -రిలీజ్ ఈవెంట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు అమ్ముడైన టికెట్లకు గానూ రూ.2.66 కోట్లు అయోధ్య రామాలయానికి విరాళంగా అందించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'హనుమాన్'. ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న 'హనుమాన్' సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. నార్త్ ఇండియా, విదేశాల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పటివరకు ఈ మూవీ రూ.150 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇంకా కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ముందే చెప్పినట్లుగా ప్రతి టికెట్ నుంచి రూ. 5 అయోధ్య ఆలయానికి విరాళంగా అందించనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా ప్రత్యేక ప్రీమియర్ షోల నుంచి విక్రయించిన 2,97,162 టికెట్లకు గానూ రూ.14,85,810 చెక్కును ఇప్పటికే అందించారు.

ఆ తర్వాత ఇప్పటివరకు 53,28,211 టిక్కెట్లను విక్రయించారు. ఒక్కో టికెట్ కు రూ.5 చొప్పున మొత్తం రూ.2,66,41,055ను అయోధ్య రామాలయానికి విరాళంగా ఇవ్వనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అయోధ్య రామ మందిరానికి భారీ మొత్తంలో విరాళం అందజేసిన 'హనుమాన్' మూవీ యూనిట్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

First Published:  21 Jan 2024 10:21 AM GMT
Next Story