Telugu Global
National

'ఆ బీజేపీ మంత్రి నా భార్యను ఆరేళ్ళపాటు రేప్ చేశాడు'

గుజరాత్ మంత్రి పై అత్యాచారం ఆరోపణలొచ్చాయి. ఓ మహిళను బంధించి ఆరేళ్ళపాటు ఆ మంత్రి అత్యాచారం చేసినట్టు బీజేపీ నాయకుడైన‌ మహిళ భర్త పోలీసులకు పిర్యాదు చేశాడు.

ఆ బీజేపీ మంత్రి నా భార్యను ఆరేళ్ళపాటు రేప్ చేశాడు
X

గుజరాత్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, మెహ్మదాబాద్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అర్జున్‌సింగ్ చౌహాన్ తన భార్యపై అనేక సార్లు అత్యాచారం చేశాడని మెహ్మదాబాద్ తాలూకాలోని హల్దర్వాస్ గ్రామం మాజీ సర్పంచ్ , బీజేపీ స్థానిక నాయకుడు పోలీసులకు పిర్యాదు చేశాడు.

"మంత్రి తన అధికారాన్ని ఉపయోగించి నా భార్యతో శారీరక సంబంధం కొనసాగించాడు. ఆమెపై పదేపదే అత్యాచారం చేసాడు" అని ఆ మాజీ సర్పంచ్ ఆరోపించాడు. మంత్రికి భయపడి తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని అతను బుధవారం డీఎస్పీకిచ్చిన పిర్యాదులో పేర్కొన్నాడు.

''2015 నుంచి 2021 మధ్యకాలంలో నా భార్యపై అర్జున్ సింగ్ అత్యాచారం చేశాడు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నా భార్యను నెలన్నర పాటు మంత్రి ఎక్కడో బంధించి ఉంచాడు. మీటింగ్‌ల పేరుతో అర్జున్ సింగ్ ఆమెను పలు చోట్లకు పిలిచి అత్యాచారం చేశాడు. అప్పటి జిల్లా బీజేపీ అధ్యక్షుడితో సహా అనేక మంది ముఖ్యనాయకుల‌తో పడుకోమని ఆమెను బలవంతం చేశాడు. చౌహాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయమని నేను నా భార్యను కోరినప్పుడు, ఆమె నిరాకరించింది, అతను చాలా శక్తివంతుడని, మన‌ కుటుంబానికి హాని కలిగిస్తాడని ఆమె భయపడింది." అని మాజీ సర్పంచ్ తన పిర్యాదులో పేర్కొన్నాడు.

దీనిపై ఖేడా ఎస్‌ఎస్పీ మాట్లాడుతూ, "మెహ్మదాబాద్ తాలూకాలోని హల్దర్వాస్ గ్రామంలో నివసిస్తున్న వ్యక్తి మాకు పిర్యాదు చేశాడు. పిర్యాదు దారుడి భార్యను మంత్రి అర్జున్ సింగ్ అక్ర‌మ నిర్బంధంలో ఉంచి అత్యాచారం చేసినట్టు ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలపై పోలీసులు ప్రాథమిక విచారణ నిర్వహించిన తర్వాత‌ ఆరోపణలు నిజమని తేలితే, అర్జున్ సింగ్ పై చర్యలు తీసుకుంటాం" అని చెప్పారు.

ఈ ఆరోపణలపై స్పందించమని కోరడానికి మీడియా ప్రయత్నించగా మంత్రి అర్జున్ సింగ్ చౌహాన్ మీడియాకు అందుబాటులోకి రాలేదు.

First Published:  30 July 2022 10:46 AM GMT
Next Story