Telugu Global
National

మోర్బీ బ్రిడ్జ్ కేసుపై హైకోర్టులో విచారణ.. హాజరు కానీ మున్సిపాల్టీ సిబ్బంది

అసలు పబ్లిక్ బ్రిడ్జ్ మరమ్మతు పనులకు టెండర్లు ఎందుకు పిలవలేదని గుజరాత్‌ చీఫ్‌ సెక్రెటరీని ప్రశ్నించింది హైకోర్టు. మోర్బీ బ్రిడ్జ్ మరమ్మతులకు సంబంధించిన కాంట్రాక్ట్ ఒప్పందాన్ని కేవలం ఒకటిన్నర పేజీలో ఎలా పూర్తి చేశారని నిలదీసింది.

మోర్బీ బ్రిడ్జ్ కేసుపై హైకోర్టులో విచారణ.. హాజరు కానీ మున్సిపాల్టీ సిబ్బంది
X


గుజరాత్ లో మోర్బీ తీగల వంతెన దుర్ఘటన రాష్ట్ర చరిత్రలోనే ఓ పెను దుర్ఘటనగా మారింది. కేవలం ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో 135మంది ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. కానీ ఈ దుర్ఘటనపై విచారణ జరిపిన అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకుని తప్పించుకోవాలనుకున్నారు. కానీ గుజరాత్ హైకోర్టు వదిలిపెట్టలేదు. సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. అయితే ఈ విచారణకు మోర్బీ మున్సిపాల్టీ తరపున ఒక్కరు కూడా హాజరు కాలేదు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలివిగా ప్రవర్తించొద్దు అంటూ మొట్టికాయలు వేసింది.

''ప్రభుత్వ విభాగమైన మోర్బీ మున్సిపాలిటీ, తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమైంది. ఫలితంగానే 135 మంది మరణించారు. అసలు ఈ ఒప్పందం.. 1963 గుజరాత్‌ మున్సిపాలిటీస్‌ చట్టానికి లోబడి జరిగిందా?'' అని గుజరాత్‌ హైకోర్టు ప్రాథమిక పరిశీలన ఆధారంగా వ్యాఖ్యానించింది. ప్రమాద ఘటనపై నేరుగా తమకు కొన్ని సమాధానాలు కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే.. బ్రిడ్జి పునరుద్దరణ కాంట్రాక్ట్ ను ఒవేరా కంపెనీకి కట్టబెట్టిన తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

టెండర్లు ఎందుకు పిలవలేదు..

ప్రభుత్వ విభాగాల్లో పనులు చేయాలంటే టెండర్ ప్రక్రియ కంపల్సరీ. కానీ మోర్బీ తీగల వంతెన మరమ్మతుల విషయంలో టెండర్లు పిలవలేదు. అజంతా గోడ గడియారాలు తయారు చేసే ఒరేవా గ్రూప్ కి మరమ్మతు, 15 ఏళ్లపాటు నిర్వహణ కాంట్రాక్ట్ అప్పగించారు. అసలు పబ్లిక్ బ్రిడ్జ్ మరమ్మతు పనులకు టెండర్లు ఎందుకు పిలవలేదని గుజరాత్‌ చీఫ్‌ సెక్రెటరీని ప్రశ్నించింది హైకోర్టు. మోర్బీ బ్రిడ్జ్ మరమ్మతులకు సంబంధించిన కాంట్రాక్ట్ ఒప్పందాన్ని కేవలం ఒకటిన్నర పేజీలో ఎలా పూర్తి చేశారని నిలదీసింది. కాంట్రాక్ట్‌ పత్రాల ఫైల్స్ ని తమకి సమర్పించాలని ఆదేశించింది. కోర్టులో ఈ కేసు విచారణ సంగతి పక్కనపెడితే, అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ దుర్ఘటన ప్రభుత్వానికి మాయని మచ్చలా మారింది.

First Published:  15 Nov 2022 9:37 AM GMT
Next Story