Telugu Global
National

డెయిరీ సొమ్ము మేసిన మోదీ శిష్యుడు.. ఇప్పుడేమంటారు భక్తులు..

2007లో మోదీ సమక్షంలోనే ఆయన బీజేపీలో చేరారు. ఇప్పటికీ అదే పార్టీలోనే ఉన్నారు. విపుల్‌ చౌదరి డెయిరీ చైర్మన్‌ గా ఉన్నపుడు గుజరాత్‌ సీఎంగా మోదీ ఉన్నారు.

డెయిరీ సొమ్ము మేసిన మోదీ శిష్యుడు.. ఇప్పుడేమంటారు భక్తులు..
X

మోదీ పుట్టినరోజుని ఓ రేంజ్ లో నిర్వహించబోతున్నారు బీజేపీ నేతలు. వారోత్సవాలు, పక్షోత్సవాలు అంటూ హడావిడి చేస్తున్నారు. కానీ మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో మాత్రం ఆ హడావిడి కనిపించడంలేదు, కారణం సరిగ్గా పుట్టినరోజుకి రెండు రోజుల ముందే మోదీ పాపం బయటపడటం. మోదీ శిష్యుడు చేసిన 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి రావడం. అవును, మోదీయే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోదీ హయాంలో ఆయన మెహ్‌ సానా జిల్లా కో ఆపరేటివ్‌ ప్రొడ్యూసర్స్‌ యూనియన్‌ లిమిటెడ్‌ (దూద్‌సాగర్‌ డెయిరీ)కు చైర్మన్ గా ఉన్నారు. ఆ సమయంలోనే కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణంలో ఇటీవల విపుల్ చౌదరిని ఏసీబీ అరెస్ట్ చేయగా కోర్టు వారం రోజుల కస్టడీ విధించింది.

మోదీ శిష్యుడే..

2007లో మోదీ సమక్షంలోనే ఆయన బీజేపీలో చేరారు. ఇప్పటికీ అదే పార్టీలో ఉన్నారు. విపుల్‌ చౌదరి డెయిరీ చైర్మన్‌ గా ఉన్నపుడు గుజరాత్‌ సీఎంగా మోదీ ఉన్నారు. డెయిరీ చైర్మన్‌ గా ఉన్న సమయంలో పెద్ద మొత్తంలో పాల కూలర్లు, గన్నీ బ్యాగ్ లను కొనుగోలు చేశారు విపుల్. ఈ కొనుగోళ్లలో ప్రభుత్వ మార్గదర్శకాలు, నిబంధనలు పాటించలేదు. టెండరు షరతులను ఉల్లంఘిస్తూ రూ.485 కోట్ల నిర్మాణాలకు కూడా అనుమతి ఇచ్చారు. డెయిరీ ప్రచార బాధ్యతలను తనవాళ్లకే అప్పగించారు.

ఈ స్కామ్ లో వచ్చిన డబ్బును 31 బోగస్‌ కంపెనీలకు మళ్లించారు. వాటికి డైరెక్టర్లుగా ఆయన భార్య, కొడుకుని నియమించారని ఏసీబీ విచారణలో తెలిసింది. డెయిరీ సొమ్ముని స్వాహా చేసినందుకు గతంలోనే ఆయనపై ఏసీబీ కేసులు నమోదు చేసింది, తాజాగా అరెస్ట్ చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 800కోట్ల రూపాయల కుంభకోణం జరగడంతో ఈ వ్యవహారాన్ని బయటకు రాకుండా చేయడం ఎవరి తరం కాలేదు. పైగా ఇది మోదీ హయాంలో జరగడం మరింత సంచలనంగా మారింది. మోదీ టైమ్ లో ఇంకెన్ని పాపాలు జరిగాయోనని ప్రతిపక్షాలు విర్శిస్తున్నాయి. సరిగ్గా మోదీ పుట్టినరోజంటూ భక్తులు హడావిడి చేస్తున్న వేళ, ఆయన శిష్యుడు ఏసీబీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉండటం విశేషమే.

First Published:  17 Sep 2022 3:12 AM GMT
Next Story