Telugu Global
National

ఇండియాలో గాలి అంతా క‌లుషిత‌మే.. కాస్త జాగ్రత్త

దేశంలోనే అత్యధిక కాలుష్య నగరంగా ఢిల్లీ ఉండగా.. ఆ తర్వాత మిగిలిన మెట్రో సిటీస్ ఉన్నాయి. ఈ కలుషిత గాలి వల్ల ఎక్కువగా గర్భిణిలు, పిల్లలు, వయోవృద్ధులే ప్రభావితం అవుతున్నారు.

ఇండియాలో గాలి అంతా క‌లుషిత‌మే.. కాస్త జాగ్రత్త
X

ఇండియాలో ఉన్న జనాలంతా కలుషిత గాలే పీలుస్తున్నారు. తలుపులు వేసుకొని, కిటికీలు మూసుకొని ఇంట్లో కూర్చున్నా.. సెంట్రలైజ్డ్ ఏసీ ఉన్న గాజుల ఆఫీసులో పని చేస్తున్నా.. మనం పీల్చేదంతా కలుషితమైన గాలే అని గ్రీన్ పీస్ ఇండియా అనే సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి విషయంలో నిర్ధారించిన పీఎం 2.5 (పీఎం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్) ను మించిన గాలే దేశంలో అందరికీ దొరుకుతున్నది. గాలిలో ధూళి కణాలు 2.5 పీఎం లోపు ఉంటే స్వచ్ఛమైనదిగా భావిస్తారు. కానీ ఇండియాలో మాత్రం ఎక్కడా 2.5 పీఎం గాలి దొరకడం లేదని తెలుస్తుంది.

ఇండియాలో ప్రతీ ఒక్కరు డబ్ల్యూహెచ్‌వో నిర్ధారించిన సగటు గైడ్‌లైన్స్ కంటే ఐదు రెట్లు ఎక్కువ పీఎం ఉన్న గాలిని పీలుస్తున్నారు. ముఖ్యంగా దేశంలోని 62 శాతం మంది గర్భిణులు ఇలాంటి కాలుష్యపూరక గాలిని పీలుస్తుండటంతో పుట్టబోయే బిడ్డకు కూడా హాని కలుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దేశంలోనే అత్యధిక కాలుష్య నగరంగా ఢిల్లీ ఉండగా.. ఆ తర్వాత మిగిలిన మెట్రో సిటీస్ ఉన్నాయి. ఈ కలుషిత గాలి వల్ల ఎక్కువగా గర్భిణిలు, పిల్లలు, వయోవృద్ధులే ప్రభావితం అవుతున్నారు.

గ్రీన్ పీస్ ఇండియా విడుదల చేసిన 'డిఫరెంట్ ఎయిర్ అండర్ వన్ స్కై' నివేదికలో గాలి కాలుష్యానికి సంబంధించి పలు సూచనలు కూడా చేశారు. కాలుష్యానికి సంబంధించిన ప్రతీ సమాచారాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని దానిలో పేర్కొన్నారు. ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్‌ను ప్రభుత్వాలు తప్పకుండా ప్రారంభించాలని కూడా కోరారు. ఏ రోజైనా కాలుష్యం బాగా పెరుగుతుందని తెలిస్తే.. ఆ రోజుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించాలని చెప్పారు. ఇలా చేయడం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉంటారని.. మాస్కులు ధరించి బయటకు వస్తారని సదరు సంస్థ చెప్పింది.

ప్రస్తుతం దేశంలోని 99 శాతం ప్రజలు కలుషితమైన గాలి పీలుస్తున్నందున వెంటనే గాలి నాణ్యతను పెంచే చర్యలు తీసుకోవాలని సూచించింది. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్‌ను మరింత పారదర్శకంగా, శక్తివంతంగా, సమర్థవంతంగా రూపొందించాలని కోరింది. ఇలా చేయడం వల్ల గాలి నాణ్యత పెరిగి, ప్రజల జీవనప్రమాణాలు కూడా పెరుగుతాయని చెప్పింది. ప్రజలు కూడా పూర్తిగా ప్రభుత్వంపై ఆధారపడకుండా.. తమ వంతు కర్తవ్యంగా చెట్లు పెంచడం.. గాలి నాణ్యతను పెంచే చర్యల్లో పాల్గొనడం చేయాలని కోరింది.

First Published:  3 Sep 2022 2:35 AM GMT
Next Story