Telugu Global
National

అనేక ద్వేషపూరిత‌ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలిని హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం

భారతీయ జనతా పార్టీలో ఆమె స్థానం, ముస్లింలు, క్రైస్తవులపై ఆమె 'ద్వేష పూరిత ప్రసంగాల నేపథ్యంలో అనేక మంది మద్రాస్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆమె నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆమె నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలయ్యింది.

అనేక ద్వేషపూరిత‌ వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలిని హైకోర్టు న్యాయమూర్తిగా నియామకం
X

ఫిబ్రవరి 6, సోమవారం, మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బిజెపికి చెందిన న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీని నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.

భారతీయ జనతా పార్టీలో ఆమె స్థానం, ముస్లింలు, క్రైస్తవులపై ఆమె 'ద్వేష పూరిత ప్రసంగాల నేపథ్యంలో అనేక మంది మద్రాస్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆమె నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆమె నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ కూడా దాఖలయ్యింది. ఆ పిటిషన్‌ను వచ్చే శుక్రవారానికి జాబితా చేసేందుకు కూడా సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది.

కాగా జనవరి 17న, సుప్రీంకోర్టు కొలీజియం మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తిగా విక్టోరియా గౌరీని సిఫార్సు చేసింది.

దీని తరువాత, ఫిబ్రవరి 1న, మద్రాస్ హైకోర్టు బార్ న్యాయవాదులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీం కోర్టు కొలీజియంకు లేఖ రాస్తూ, ఆమె సిఫార్సును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

గౌరీకి బీజేపీ లింకులు:

ఆమె 8 అక్టోబర్ 2010న బిజెపి కేరళ మహిళా మోర్చా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.

తమిళనాడులో 2014 సాధారణ ఎన్నికల్లో ఆమె బీజేపీ తరపున ప్రచారం చేశారు.

అంతేకాకుండా, గౌరీకి చెందిన ట్విట్టర్ ఖాతా తన బయోలో ఆమె బిజెపి మహిళా మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి అని పేర్కొంది.

గౌరీ వివాదాస్పద వ్యాఖ్యలు:

"ఇస్లామిక్ టెర్రర్ గ్రీన్ టెర్రర్ అయితే, క్రిస్టియన్ టెర్రర్ వైట్ టెర్రర్." అని ఆమె అన్నారు.

"మత మార్పిడి విషయంలో, ముఖ్యంగా లవ్ జిహాద్‌లో విషయంలో రెండూ (క్రైస్తవ మతం, ముస్లిం మతం ) సమానంగా ప్రమాదకరమైనవి."

ఆమె 1 అక్టోబర్ 2012న RSS ప్రచురణ కోసం రాసిన పుస్తకంలో ఇలా ఉంది:

"కానీ ఆకర్షణీయమైన, బలవంతపు మతమార్పిడులను ఆపడానికి దేశంలో ఇప్పటి వరకు ఎవరూ ఏమీ చేయలేదు. " "యాభై సంవత్సరాలుగా అట్టడుగున ఉన్న హిందువులు శక్తివంతమైన క్రైస్తవుల‌తో పోరాడుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అదుపు తప్పింది.'' అని ఆమె రాసింది.

గౌరి నియామకాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతికి లేఖ రాసిన బార్ అసోసియేషన్ సభ్యులు ఆమె నియామకం పక్షపాతానికి దారితీస్తుందని, మైనారిటీ వర్గాలకు న్యాయాన్ని అడ్డుకుంటుంద‌ని అన్నారు.

"ఆమె న్యాయమూర్తిగా మారితే, క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందిన, ముస్లింకు చెందిన ఒక వ్యాజ్యం ఆమె కోర్టులో న్యాయం పొందుతుందని ఆశించవచ్చా?" అని మద్రాస్ బార్ అసోసియేషన్ సభ్యులు ప్రశ్నించారు.

First Published:  6 Feb 2023 2:22 PM GMT
Next Story