Telugu Global
National

చార్జీలు లెక్కచేసేదెవరు..? రైల్వే మంత్రి వింత సమాధానం..

కొత్త రైళ్లు వచ్చినా ఉన్నతాదాయ వర్గాలకోసమే, కొత్త నౌకలు వచ్చినా వారికోసమే, మరి పేదలకు కేంద్రం చేస్తున్నదేంటి..?

చార్జీలు లెక్కచేసేదెవరు..? రైల్వే మంత్రి వింత సమాధానం..
X

మోదీ ప్రభుత్వం పేదల పక్షపాతి కాదు, కేవలం అదానీ, అంబానీ వంటివారికోసమేననే అపవాదు మొదటినుంచీ ఉంది. అది అపవాదే కాదు, అక్షర సత్యం అని అనేక ఘటనలు రుజువు చేస్తున్నాయి. గంగా విలాస్ అయినా, వందే భారత్ అయినా.. వాటితో పేద ప్రజలకు, కనీసం మధ్యతరగతి వారికి కూడా ఏమాత్రం ప్రయోజనం లేదు. కేవలం ఉన్నతాదాయ వర్గాలవారిని దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేసినవే. మరి వాటినే చూపించి అదే భారత అభివృద్ధి అనుకోమంటే ఎలా..? కానీ కేంద్రం ప్రచారం మాత్రం ఇలాంటి వాటి చుట్టూనే తిరుగుతోంది. గంగా విలాస్ గురించ గొప్పలు చెప్పుకుంటోంది, వందే భారత్ ప్రయాణం గురించి ఎక్కడలేని హంగామా చేస్తోంది.

వందే భారత్ లో ఎందుకంత చార్జీలు..?

గంగా విలాస్ అంటే అది విహార యాత్ర అనుకోవచ్చు, చార్జీలు లక్షల్లో ఉన్నా వాటిని సామాన్యులు పట్టించుకోరు, వారికి అవసరం లేదు. మరి వందే భారత్ సంగతేంటి. హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లాలనుకునేవారు కేవలం పెద్దవారేనా, పేదలు ఉండరా. వారికి వందే భారత్ లో చోటు లేదా..? చార్జీలు భారీగా ఉన్నాయి కదా అనే ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇచ్చిన సమాధానం మాత్రం విచిత్రంగా ఉంది. ప్రయాణికులు ఇప్పుడు సమయానికి, సౌకర్యానికి ప్రాధాన్యమిస్తున్నారని, త్వరగా గమ్యం చేరాలని, ప్రయాణంలో అనుభూతి పొందాలని కోరుకుంటున్నారని, అవన్నీ వందేభారత్‌ లో ఉన్నాయని, అందుకే చార్జీలు ఆ స్థాయిలో ఉన్నాయన చెప్పుకొచ్చారు.

సామాన్యుల సంగతేంటి..?

కొత్త రైళ్లు వచ్చినా ఉన్నతాదాయ వర్గాలకోసమే, కొత్త నౌకలు వచ్చినా వారికోసమే, మరి పేదలకు కేంద్రం చేస్తున్నదేంటి. కనీసం ప్యాసింజర్ రైళ్ల సంఖ్య పెంచారా అంటే దానికీ రైల్వే మంత్రి వద్ద సమాధానం లేదు. పోనీ సీనియర్ సిటిజన్లకు రాయితీ సంగతేంటి అని అడిగినా కూడా ఆయన మాట దాటేశారు. ఇప్పటికే ప్రతి ప్రయాణికుడికి టికెట్ లో రైల్వే 55శాతం రాయితీ ఇస్తోందని, ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లకు రాయితీ అంటే కుదిరేపని కాదని చెప్పారు. అంటే ప్రజలకోసమే రైల్వే పనిచేస్తోందని, రైల్వేకు ప్రయాణికుల వల్ల ఆదాయం లేదని తేల్చేశారు మంత్రి అశ్వినీ వైష్ణవ్.

అభివృద్ధి అంటే హై స్పీడ్ రైళ్లు, కొత్త విమానాశ్రయాలు, క్రూజ్ షిప్ లు అనుకుంటున్నారు ప్రధాని మోదీ. అందుకే పేదల సొంతింటి నిర్మాణం అనే హామీని ఆయన గాలికొదిలేశారు. కేంద్రంలో ఉన్నది పేదల ప్రభుత్వం కాదు అని పదే పదే రుజువు చేసుకుంటున్నారు.

First Published:  17 Jan 2023 2:49 AM GMT
Next Story