Telugu Global
National

గోవా: 'పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రజలకు, దేవునికి శత్రువులు'

గోవాలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి పిరాయించడంపై గోవా ఫార్వ‌ర్డ్ పార్టీ (జిఎఫ్ పి) అధినేత‌, ఎమ్మెల్యే విజ‌య్ సర్దేశాయి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన వారు ప్రజలకు దేవునికి శత్రువులు అని ఆయన వ్యాఖ్యానించారు.

గోవా: పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రజలకు, దేవునికి శత్రువులు
X

విప‌క్ష‌ పార్టీల ఎంపీల‌ను బిజెపి సంత‌లో ప‌శువుల మాదిరిగా కొనుగోలు చేస్తోంద‌ని గోవా ఫార్వ‌ర్డ్ పార్టీ (జిఎఫ్ పి) అధినేత‌, ఎమ్మెల్యే విజ‌య్ సర్దేశాయి ధ్వ‌జ‌మెత్తారు. అధికార బిజెపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు "పవిత్ర దుర్మార్గులు" , "ప్రజలకు, దేవునికి శత్రువులు" అని ఆయన వ్యాఖ్యానించారు.

"రాజకీయ ఔచిత్యానికి, క‌నీస మర్యాదకు, నిజాయితీకి వ్యతిరేకంగా వారు పార్టీ మారారు. తమ ఆర్ధిక‌, అధికార దాహం తీర్చుకునేందుకు ఆ ఎనిమిది మంది శాసనసభ్యులు నేడు చెడుకు ప్రతీకగా నిలిచారు" అని విజయ్ సర్దేశాయి అన్నారు.

ఈ ఎమ్మెల్యేల చ‌ర్య‌ల‌తో తాము వెన్నుపోటుకు గుర‌య్యామ‌ని గోవా ప్రజలు భావిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. బిజెపి అధికారంలో ఉండటానికి వంచనకు, అవకతవకల‌కు పాల్ప‌డుతోంద‌ని, ఎమ్మెల్యేలు "తమను పశువుల మాదిరిగా కొనుగోలు చేయడానికి బిజెపిని అనుమతిస్తున్నారు" అని ఆయన ఆరోపించారు. 'ఈ ద్రోహులను తిప్పికొట్టండి.. ప్రజలకు, దేవుడికి శత్రువులుగా ముద్ర వేయండి' అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ ఫిరాయింపులు కేవలం ప్రజల ఆదేశానికి ద్రోహం చేయడమే కాదు, "దేవుని కించపరచడం, అపహాస్యం చేయడ‌మే" అని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్, సీనియర్ నాయకుడు మైఖేల్ లోబో నేతృత్వంలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఎనిమిది మంది ఈరోజు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ జూలైలో దీనిని అడ్డుకోగలిగింది, కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో 'భారత్ జోడో యాత్ర' చేస్తున్న సంద‌ర్భంలోనే ఇలా ఫిరాయింపులు జ‌ర‌గ‌డం పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారింది.

First Published:  14 Sep 2022 10:44 AM GMT
Next Story