Telugu Global
National

వార్తలు ఫాలో అయ్యే వారి సంఖ్య ఇండియాలో తగ్గిపోతోంది.. రాయిటర్స్ సంచలన నివేదిక

టీవీల్లో వార్తలు చూసే వారి సంఖ్య కూడా 10 శాతం మేర పడిపోయినట్లు రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్ డిజిటల్ న్యూస్-2023 నివేదికలో వెల్లడించింది.

వార్తలు ఫాలో అయ్యే వారి సంఖ్య ఇండియాలో తగ్గిపోతోంది.. రాయిటర్స్ సంచలన నివేదిక
X

వార్తలు ఫాలో అయ్యే వారి సంఖ్య ఇండియాలో తగ్గిపోతోంది.. రాయిటర్స్ సంచలన నివేదిక

వార్తలు చదివే వారు, వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నది. గతేడాదితో పోల్చుకుంటే ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్‌లో వార్తలు చదివే వారి సంఖ్య 12 శాతం మేర తగ్గిపోయింది. అలాగే.. టీవీల్లో వార్తలు చూసే వారి సంఖ్య కూడా 10 శాతం మేర పడిపోయినట్లు రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్ డిజిటల్ న్యూస్-2023 నివేదికలో వెల్లడించింది. ఏసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంతో కలిసి రాయిటర్స్ చేసిన ఈ సర్యే రిపోర్టును బుధవారం విడుదల చేసింది. 46 దేశాల్లో ఈ సర్వేను చేపట్టినట్లు పేర్కొన్నది.

ఇండియాలో మొత్తంగా న్యూస్ చదివే వారి సంఖ్య కాస్త తగ్గినట్లు రిపోర్టులో వెల్లడించింది. న్యూస్ చదవుతున్న వారిపై 46 దేశాల్లో సర్వే నిర్వహించగా.. ఇండియాకు 24వ ర్యాంకు ఇచ్చింది. ఫిన్‌లాండ్ దేశంలో న్యూస్ పట్ల నమ్మకం ఉంచే వారి సంఖ్య 69 శాతంగా ఉండగా.. గ్రీస్‌లో కేవలం 19 శాతం మంది మాత్రమే వార్తలపై నమ్మకం ఉంచుతున్నారు.

ఇక న్యూస్ బ్రాడ్‌కాస్టర్లలో డీడీ ఇండియా, ఆల్ ఇండియా రేడియో, బీబీసీ న్యూస్‌ల పట్ల భారత ప్రజలు ఎక్కువగా నమ్మకం ఉంచుతున్నట్లు స్పష్టమైంది. యూట్యూబ్‌ ద్వారా వార్తలు తెలుసుకుంటున్న వారి సంఖ్య దేశంలో 56 శాతం మేర ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. దాని తర్వాత వాట్సప్ ద్వారా 47 శాతం, ఫేస్‌బుక్ ద్వారా 39 శాతం మంది వార్తలను తెలుసుకుంటున్నారు. ఇండియాలో దైనిక్ భాస్కర్ అనే హిందీ దినపత్రిక టాప్ 10 బ్రాండ్లలో అగ్ర స్థానంలో ఉన్నట్లు సర్వే నివేదికలో తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా వీడియో బేస్డ్ న్యూస్ పట్ల ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు పేర్కొన్నారు. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లు న్యూస్‌ను ప్రమోట్ చేయడంలో ముందంజలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా, ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్.. న్యూస్ విషయంలో తన పాపులారిటీని కోల్పోతున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. 2023లో ఫేస్‌బుక్ ద్వారా వార్తలు తెలుసుకునే వారి సంఖ్య 28 శాతానికి పడిపోయింది. 2016లో వీరి సంఖ్య 42 శాతంగా ఉండేది.

వార్తల విషయంలో ఫేస్‌బుక్‌ను వాడే వారి సంఖ్య క్రమంగా పడిపోతుండగా.. టిక్‌టాక్, యూట్యూబ్‌లు ఆ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ రెండు మాధ్యమాల ద్వారానే వార్తలు తెలుసుకుంటున్నారు. ఇక ట్విట్టర్ ద్వారా వార్తలను తెలుసుకునే వారి సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న నాటి నుంచి వార్తల విషయంలో ఎలాంటి సబ్‌స్క్రైబర్లు పెరగలేదు.

18 నుంచి 24 ఏళ్ల వయసు ఉన్న యువతలో 44 శాతం మంది టిక్‌టాక్ ఉపయోగిస్తుండగా.. అందులో 20 శాతం మంది వార్తల కోసమే ఆ ప్లాట్‌ఫామ్‌ను వాడుతున్నారు. చైనాకు చెందిన టిక్‌టాక్ ప్రభావం ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాలో ఎక్కువగా ఉన్నది.

టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్ చాట్ ఉపయోగిస్తున్న వారు ఎక్కువగా సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను ఫాలో అవుతున్నారు. ఆ తర్వాత జర్నలిస్టులు, మీడియా సంస్థలకే ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా వార్తల విషయంలో జర్నలిస్టులు, మీడియా సంస్థలను ఫాలో అవుతుండటం.. సాంప్రదాయ జర్నలిజం భవిష్యత్‌ పట్ల ఆందోళనకరంగా మారింది.

న్యూస్ వెబ్‌సైట్లను నేరుగా చూసే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోతున్నదని రిపోర్టులో పేర్కొన్నారు. న్యూస్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా 2018లో 32 శాతం మంది వార్తలు తెలుసుకునేవారు. అయితే 2023లో వారి సంఖ్య 22 శాతానికి పడిపోయింది. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా వార్తలు తెలుసుకునే వారి సంఖ్య 23 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది.

న్యూస్ పాడ్‌కాస్ట్‌ల పట్ల యువత, విద్యావంతులు ఎక్కువగా ఆక్షించబడుతున్నట్లు సర్వేలో పేర్కొన్నారు. దాదాపు 34 శాతం మంది పాడ్‌కాస్ట్‌లను ప్రతీ నెల యాక్సెస్ చేస్తున్నారు. కాగా, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది వార్తలకు దూరంగా ఉంటున్నారని కూడా సర్వేలో పేర్కొన్నారు. 53 శాతం మంది కొంత కాలం పాటు న్యూస్‌ను ఫాలో కావడం ఆపేయగా.. 32 శాతం మంది ఆందోళనకు గురి చేసే వార్తలను చూడటం లేదని తెలుస్తోంది.

First Published:  15 Jun 2023 11:30 AM GMT
Next Story