Telugu Global
National

సీటుబెల్ట్, హెల్మెట్ పై నిర్లక్ష్యం.. 63వేల ప్రాణాలు బలి

కారు ప్రమాదాల విశ్లేషణలో కేవలం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16,397 గా తేల్చారు అధికారులు. వీరిలో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నవారు 8,438మంది కాగా, వారి పక్కన కూర్చున్నవారు 7,959 మంది.

సీటుబెల్ట్, హెల్మెట్ పై నిర్లక్ష్యం.. 63వేల ప్రాణాలు బలి
X

వీధి చివరి వరకే కదా.. కారులో సీటు బెల్ట్ పెట్టుకోకపోతే ఏమవుతుంది. ఊరిలోనే కదా.. బైక్ పై వెళ్లేటప్పుడు హెల్మెట్ లేకపోతే ఏమవుతుంది. చాలామంది ఇలాగే ఆలోచిస్తారు, వారు కూడా ఇలాగే ఆలోచించి సీటు బెల్ట్ ని, హెల్మెట్ ని నిర్లక్ష్యం చేశారు. చివరకు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా 2021లో సీటు బెల్ట్, హెల్మెట్ లేని కారణంగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన వారి సంఖ్య 62,990. కేంద్రం తాజాగా విడుదల చేసిన గణాంకాలివి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'భారత్ లో రోడ్డు ప్రమాదాలు -2021' నివేదికలో ఈ వివరాలున్నాయి.

దేశవ్యాప్తంగా 2021లో జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్య 4,12,432

ప్రమాదాల్లో మరణించిన వారు 1,53,972

గాయపడిన వారు 3,84,448

ప్రాణాలు తీసిన నిర్లక్ష్యం..

కారు ప్రమాదాల విశ్లేషణలో కేవలం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16,397 గా తేల్చారు అధికారులు. వీరిలో డ్రైవింగ్ సీట్లో కూర్చున్నవారు 8,438మంది కాగా, వారి పక్కన కూర్చున్నవారు 7,959 మంది.

బైక్ ప్రమాదాల విషయానికొస్తే, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల 46,593మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 32,877మంది బైక్ డ్రైవ్ చేసినవారు కాగా, మిగిలినవారు వారి వెనక కూర్చుని ప్రయాణించినవారు. బైక్ నడిపే వ్యక్తితోపాటు, వెనక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలని నిబంధనలున్నా కూడా ఎవరూ లక్ష్యపెట్టడంలేదు, లెక్క చేయడంలేదు. ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

మరణాల సంగతి పక్కనపెడితే ప్రమాదాల కారణంగా జీవచ్ఛవాలుగా బతుకుకున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 2021లో మొత్తం 1,32,994మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడి మంచానికే పరిమితం అయ్యారు. కొందరు కోలుకున్నా వారికి తగిలిన గాయాలు వారి జీవితాలనే మార్చేశాయి. చిన్న చిన్న దెబ్బలతో బయటపడినవారికి మాత్రం ప్రాణం విలువ తెలిసొచ్చింది.

ఉత్తర ప్రదేశ్ టాప్..

రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగిన రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్తాన్ ఉన్నాయి. ఇక నగరాల విషయానికొస్తే టాప్ ప్లేస్ ఢిల్లీది. మరణాలు కూడా ఎక్కువగా ఢిల్లీలోనే సంభవించాయి. ఆ తర్వాత చెన్నై, బెంగళూరు ఉన్నాయి.

First Published:  30 Dec 2022 2:24 AM GMT
Next Story