Telugu Global
National

రెజ్లింగ్ స‌మాఖ్య‌కు మ‌హిళా అధ్య‌క్షురాలు.. - కేంద్ర మంత్రి ముందు రెజ్ల‌ర్ల డిమాండ్‌

బుధ‌వారం ఉద‌యం బజ్‌రంగ్ పునియా, సాక్షి మాలిక్ చర్చల నిమిత్తం అనురాగ్ ఠాకూర్ ఇంటికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ప‌లు డిమాండ్ల‌ను వారు మంత్రి ముందుంచారు.

రెజ్లింగ్ స‌మాఖ్య‌కు మ‌హిళా అధ్య‌క్షురాలు.. - కేంద్ర మంత్రి ముందు రెజ్ల‌ర్ల డిమాండ్‌
X

లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయడంతో పాటు రెజ్లింగ్ సమాఖ్యకు మహిళా అధ్యక్షురాలిని నియమించాలని రెజ్ల‌ర్లు డిమాండ్ చేశారు. కేంద్ర క్రీడ‌ల మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో బుధ‌వారం జ‌రిగిన భేటీ సంద‌ర్భంగా రెజ్ల‌ర్లు మొత్తం 5 డిమాండ్ల‌ను ఆయ‌న ముందుంచిన‌ట్టు జాతీయ మీడియాలో పలు కథనాలు వెల్లడ‌య్యాయి.

బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూష‌ణ్‌కు వ్య‌తిరేకంగా రెజ్ల‌ర్లు చేప‌ట్టిన ఆందోళ‌న‌పై స్పందించిన కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం వారిని మ‌రోసారి చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించింది. "రెజ్లర్ల సమస్యలపై వారితో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ విషయమై వారిని మరోసారి చర్చలకు ఆహ్వానించాను`` అంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అర్ధ‌రాత్రి ట్వీట్ చేశారు. కేంద్రమంత్రి ఆహ్వానాన్ని రెజ్లర్లు అంగీకరించారు. బుధ‌వారం ఉద‌యం బజ్‌రంగ్ పునియా, సాక్షి మాలిక్ చర్చల నిమిత్తం అనురాగ్ ఠాకూర్ ఇంటికి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా ప‌లు డిమాండ్ల‌ను వారు మంత్రి ముందుంచారు.

రెజ్ల‌ర్ల డిమాండ్లివీ..

- భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించాలి.

- బ్రిజ్ భూషణ్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ రెజ్లింగ్ సమాఖ్యలో భాగం కాకూడదు.

- రెజ్లింగ్ సమాఖ్యలో అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పాలక మండలికి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి.

- ఏప్రిల్ 28న జంతర్ మంతర్ వద్ద జరిగిన ఉద్రిక్తతల కారణంగా మాపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దుచేయాలి.

- లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలి.

ప్రభుత్వంతో రెజ్లర్లు చర్చలు జరపడం గ‌త వారం రోజుల్లో ఇది రెండోసారి. గత శనివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వీరు భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశంలో తమకు ఆశించిన ఫలితం దక్కలేదని బజ్‌రంగ్ పునియా తెలిపారు.

First Published:  7 Jun 2023 11:38 AM GMT
Next Story