Telugu Global
National

ఇన్ స్టా కోసం గుడి ఎనక నా సామి.. కేసు నమోదు చేసిన పోలీసులు

భోపాల్ లో గుడిలో ఐటంసాంగ్ చేసిన అమ్మాయి ఎవరికీ తెలియకుండా షూటింగ్ కానిచ్చేసింది, ఆ తర్వాత ఇన్ స్టా లో అప్ లోడ్ చేయడంతో పోలీసులు కేసు పెట్టారు.

ఇన్ స్టా కోసం గుడి ఎనక నా సామి.. కేసు నమోదు చేసిన పోలీసులు
X

ఇన్ స్టా లో ఫాలోవర్లను పెంచుకోడానికి చాలామందికి ఏం చేయాలో తెలియడంలేదు. అడల్ట్ కంటెంట్, అబ్యూసివ్ కంటెంట్ ని ఎంచుకుంటున్నారు. కొంతమంది యువతులు ఐటంసాంగ్స్ ని ఎంపిక చేసుకుని వాటిని రీ షూట్ చేసి ఇన్ స్టా లో అప్ లోడ్ చేస్తున్నారు. తాజాగా భోపాల్ లో ఓ యువతి ఇలా గుడిలో ఐటంసాంగ్ షూటింగ్ చేసి చివరకు పోలీస్ కేసు ఎదుర్కొంది.

ఇన్ స్టా వీడియోలకోసం అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ సాహసాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాద్ మెట్రోలో కూడా ఓ యువతి ఇలా పాటలకు డ్యాన్స్ లు చేసింది. చివరకు పోలీసులు ఆమెను హెచ్చరించి వదిలేశారు. మెట్రో వ్యవస్థ కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. ఇకపై ఎవరూ మెట్రో స్టేషన్లలో, రైళ్లలో ఇలా రెచ్చిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. జనసంచారం ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి వ్యవహారాలు అందరికీ తెలుస్తాయి, కానీ జనసంచారం లేని ప్రాంతాల్లో రెచ్చిపోతే చివరకు ఇన్ స్టా లో అప్ లోడ్ చేసిన తర్వాత వాటి బండారం బయటపడుతుంది. భోపాల్ లో గుడిలో ఐటంసాంగ్ చేసిన అమ్మాయి కూడా ఎవరికీ తెలియకుండా షూటింగ్ కానిచ్చేసింది, ఆ తర్వాత ఇన్ స్టా లో అప్ లోడ్ చేయడంతో పోలీసులు కేసు పెట్టారు. మధ్యప్రదేశ్ హోం మంత్రి ఆదేశాలతో నేహా మిశ్రా అనే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

మధ్యప్రదేశ్‌ లోని ఛతర్‌ పూర్ జిల్లాలోని ఓ ఆలయంలో చిరిగిన జీన్స్ తో, దబంగ్ సినిమాలోని ఐటంసాంగ్ కి డ్యాన్స్ చేసింది నేహా మిశ్రా. ఇన్ స్టాలో ఆమెకు 10లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. ఇలాంటి వీడియోలతో హాట్ హాట్ ఫోజులిస్తోంది కాబట్టే ఆమెను అంతమంది ఫాలో అవుతున్నారు. సినిమా పాటలకు ఆమె చేసిన డ్యాన్స్ లు కూడా బాగా ఫేమస్ అయ్యాయి. ఐటంసాంగ్స్ అందులో మరింత ఫేమస్. అయితే గుడిలో చిరిగిన జీన్స్ తో ఐటంసాంగ్ చేయడం మాత్రం వివాదాలకు కారణం అయింది. చివరకు పోలీస్ కేసు తర్వాత ఆమె క్షమాపణ చెప్పడం, వీడియో డిలీట్ చేయడంతో వ్యవహారం సద్దుమణిగింది.

First Published:  4 Oct 2022 10:29 AM GMT
Next Story