Telugu Global
National

కన్నకొడుకును విషమిచ్చి చంపిన తండ్రి

ఎన్నిసార్లు మందలించినా కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసుగెత్తిపోయిన విజయ్‌.. కుమారుడిని చంపేయాల‌ని నిర్ణయించుకున్నాడు.

కన్నకొడుకును విషమిచ్చి చంపిన తండ్రి
X

కన్న కొడుకును ఓ తండ్రి విషమిచ్చి ప్రాణం తీశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటికి సమీపంలోని మురికి కాల్వలో పడేశాడు. మహారాష్ట్రలోని శోలాపుర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిందితుడు విజయ్‌ బట్టు దర్జీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని కుమారుడు విశాల్‌ (14) దగ్గరలోని పాఠశాలలో చదువుకొనేవాడు. రోజూ స్కూలుకు ఫోను తీసుకువెళ్లి అక్కడ అశ్లీల చిత్రాలు చూసేవాడు. ఈ విషయమై ఉపాధ్యాయులు పలుమార్లు తండ్రికి ఫిర్యాదు చేశారు.

ఎన్నిసార్లు మందలించినా కొడుకు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విసుగెత్తిపోయిన విజయ్‌.. కుమారుడిని చంపేయాల‌ని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా విశాల్‌ తినే ఆహారంలో విషం కలిపాడు. కుమారుడు మృతిచెందడంతో మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి సమీపంలోని మురికి కాల్వలో పడేశాడు. ఈ సంగతి అతని భార్యకు తెలియదు. ఆ తర్వాత కుమారుడు కనిపించడం లేదంటూ జనవరి 13న దంపతులిద్దరూ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విజయ్‌ ఇంటికి సమీపంలోని మురికి కాల్వలో అతని మృతదేహం కనిపించింది. దొరికిన ఆధారాలకు, మృతుడి తండ్రి చెప్పిన వివరాలకు పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఎలాగైనా దొరికిపోతానని గ్రహించిన విజయ్‌.. జరిగిన విషయాన్ని జనవరి 28న తన భార్యకు చెప్పాడు. ఆ తర్వాత పోలీస్‌ స్టేషనుకు వెళ్లి నేరాన్ని అంగీకరించాడు. హత్యకేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి రెండు రోజుల కస్టడీకి అనుమతించారు. ఈ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో సంచలనంగా మారింది.

First Published:  2 Feb 2024 5:11 AM GMT
Next Story