Telugu Global
National

ప్రకాష్‌రాజ్‌కు ఈడీ సమన్లు!

ఓ జ్యువెల్లరీ సంస్థకు సంబంధించిన‌ రూ.100 కోట్ల స్కామ్‌ కేసు విచారణలో భాగంగా ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. తమిళనాడు తిరుచిరాపల్లికి చెందిన ప్రణవ్‌ జ్యువెల్లర్స్‌కు ప్రకాష్‌రాజ్‌ గతంలో చాలాకాలంపాటు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించారు.

ప్రకాష్‌రాజ్‌కు ఈడీ సమన్లు!
X

సినీ నటుడు ప్రకాష్‌రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ షాకిచ్చింది. ఓ జ్యువెల్లరీ సంస్థకు సంబంధించిన‌ రూ.100 కోట్ల స్కామ్‌ కేసు విచారణలో భాగంగా ఆయనకు ఈడీ సమన్లు జారీ చేసింది. తమిళనాడు తిరుచిరాపల్లికి చెందిన ప్రణవ్‌ జ్యువెల్లర్స్‌కు ప్రకాష్‌రాజ్‌ గతంలో చాలాకాలంపాటు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించారు.

బంగారంపై పెట్టుబడి పేరుతో అధిక లాభాల ఆశ చూపి ప్రజల నుంచి దాదాపు రూ100 కోట్లు వసూలు చేసింది ప్రణవ్‌ జ్యువెల్లర్స్ సంస్థ‌. వారికి లాభాలు ఇవ్వకపోగా వసూలు చేసిన మొత్తాన్ని కూడా తిరిగివ్వలేదు. తర్వాత ఈ ఏడాది అక్టోబర్‌లో స‌ద‌రు సంస్థ‌ బోర్డు తిప్పేసింది. దీంతో ఆ సంస్థ యజమాని మధ‌న్‌పై తిరుచిరాపల్లిలోని ఎకనమిక్ అఫెన్స్ వింగ్‌ కేసు నమోదు చేసింది. నవంబర్‌లో మధ‌న్‌తో పాటు ఆయన భార్యపై లుక్ అవుట్‌ నోటీసులు సైతం జారీ చేసింది.

ఈ కేసుకు సంబంధించి చెన్నై, పుదుచ్చేరిలో ప్రణవ్‌ జ్యువెల్లర్స్‌ బ్రాంచ్‌లు, యజమానుల ఇల్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. ఈ క్రమంలో రూ.100 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరుకావాలని ప్రకాష్‌రాజ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై ఇప్పటివరకూ ప్రకాష్‌రాజ్ స్పందించలేదు.

First Published:  23 Nov 2023 4:11 PM GMT
Next Story