Telugu Global
National

మద్యం తాగకు అన్నందుకు.. తండ్రిని త్రిశూలంతో పొడిచి చంపిన తనయుడు

దుఖ్ రామ్ (61) అనే వ్యక్తి కుమారుడు ఖేమ్ లాల్ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కూలి పనులు చేసేవాడు. ఇటీవల అతడు సెలవు పెట్టి స్వగ్రామానికి వచ్చాడు.

మద్యం తాగకు అన్నందుకు.. తండ్రిని త్రిశూలంతో పొడిచి చంపిన తనయుడు
X

ఆ యువకుడు మద్యానికి బానిస అయ్యాడు. రోజూ రాత్రి అయ్యేసరికి పీకల దాకా తాగి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. కుమారుడి తీరుతో విసుగు చెందిన తండ్రి.. మద్యం తాగవద్దని, దానివల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయని మందలించాడు. దీంతో ఆగ్రహించిన కుమారుడు సమీపంలోని గుడికి వెళ్లి అక్కడున్న త్రిశూలం తెచ్చి తండ్రిని పొడిచి చంపాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఛత్తీస్‌గడ్ లోని రాజ్ నంద్ గావ్ జిల్లాలో జరిగింది.

దుఖ్ రామ్ (61) అనే వ్యక్తి కుమారుడు ఖేమ్ లాల్ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కూలి పనులు చేసేవాడు. ఇటీవల అతడు సెలవు పెట్టి స్వగ్రామానికి వచ్చాడు. మొదటి నుంచి మద్యం సేవించే అలవాటు ఉన్న ఖేమ్ లాల్ ఇంటికి వచ్చినప్పటి నుంచి మద్యానికి బానిస అయ్యాడు. రోజూ తాగి ఇంటికి రావడం.. ఇంట్లో వాళ్లతో గొడవలు పడటం జరిగేది.

రెండు రోజుల కిందట దుఖ్ రామ్ ఆలయ సమీపంలో కూర్చుని ఉండగా అక్కడికి ఖేమ్ లాల్ మద్యం సేవించి వచ్చాడు. దీంతో మద్యం తాగవద్దని కుమారుడిని మందలించాడు దుఖ్ రామ్. ఈ కారణంగా కుటుంబంలో గొడవలు తలెత్తుతున్నాయని మండిపడ్డాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఖేమ్ లాల్ సమీపంలోని గుడిలోకి పరిగెత్తుకొని వెళ్లాడు. అక్కడ అమ్మవారి వద్ద పెట్టిన త్రిశూలాన్ని తీసుకువచ్చి తండ్రిని పొడిచాడు. దీంతో దుఖ్ రామ్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు ఖేమ్ లాల్ ను అరెస్టు చేశారు. మద్యం తాగవద్దని సూచించిన తండ్రిని కుమారుడు హత్య చేయడం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.

First Published:  7 April 2023 1:58 PM GMT
Next Story