Telugu Global
National

ఢిల్లీలో మరో దారుణం.. కుటుంబంలో నలుగురిని నరికి చంపిన యువకుడు

కేశవ్ డ్రగ్స్‌కి బానిస కావడంతో ఇంట్లో వారందరూ అతడిని దూషించేవారు. దీంతో వారిపై కక్ష పెంచుకున్న యువ‌కుడు కుటుంబంలోని అందరినీ నరికేశాడు.

ఢిల్లీలో మరో దారుణం.. కుటుంబంలో నలుగురిని నరికి చంపిన యువకుడు
X

ఢిల్లీలో మరో దారుణం జరిగింది. డ్రగ్స్ కు బానిసైన ఓ యువకుడు తల్లిదండ్రులు, సోదరి, అమ్మమ్మను దారుణంగా హతమార్చాడు. ఒక్కొక్కరిని చంపి బాత్ రూమ్‌లో మృతదేహాలను దాస్తూ గంట వ్యవధిలోనే మారణకాండ సృష్టించాడు. ఈ సంఘటతో ప్రస్తుతం ఢిల్లీలో తీవ్ర కలకలం నెలకొంది. ఢిల్లీలోని పాలం ప్రాంతంలో కేశవ్ (25) అనే యువకుడు తండ్రి దినేష్ కుమార్, తల్లి దర్శన్ సైనీ, చెల్లెలు ఊర్వశి, అమ్మమ్మ దీవానో దేవితో కలసి ఉంటున్నాడు.

అయితే కొద్దిరోజులుగా కేశవ్ డ్రగ్స్ కి బానిసగా మారాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని డ్రగ్స్ అడిక్షన్ సెంటర్‌లో చేర్పించారు. ఇటీవలే ఆ కేంద్రం నుంచి తిరిగి వచ్చిన కేశవ్ ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్నాడు. కాగా మంగళవారం రాత్రి కేశవ్ మొదట తండ్రిని, అమ్మమ్మను పదునైన కత్తితో నరికి చంపాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మృతదేహాలను బాత్ రూమ్‌లోకి లాక్కెళ్లి దాచాడు. ఆ తర్వాత తన తల్లిని ఇలాగే చంపాడు.

ఈ హత్యలు జరిగిన సమయంలో కేశవ్ చెల్లెలు ఊర్వశి ఆఫీస్‌కి వెళ్ళింది. ఆమె ఇంటికి వచ్చేలోపు అమ్మానాన్న,అమ్మమ్మను చంపిన కేశవ్ ఊర్వశి ఇంటికి రాగానే ఆమెను కూడా కత్తితో నరికి దారుణంగా హతమార్చాడు.ఈ ఘటన జరిగిన అనంతరం కేశవ్ ను బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు పారిపోయాడు.

స్థానికులు ఇచ్చిన సమాచారంతో నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కుటుంబ కలహాల కారణంగానే కేశవ్ ఈ దారుణానికి ఒడికట్టినట్టు తెలుస్తోంది. కేశవ్ డ్రగ్స్ కి బానిస కావడంతో ఇంట్లో వారందరూ అతడిని దూషించేవారు. దీంతో వారిపై కక్ష పెంచుకున్న కేశవ్ కుటుంబంలోని అందరినీ నరికేశాడు. సొంత అమ్మానాన్న, చెల్లి, అమ్మమ్మ అని కూడా చూడకుండా కేశవ్ వారి గొంతుకోసి, శరీరంలో పలుచోట్ల పొడిచి చంపడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

First Published:  23 Nov 2022 7:23 AM GMT
Next Story