Telugu Global
National

స్కూల్ పిల్లల అవతారంలో ఎమ్మెల్యేలు.. బ్యాగ్, యూనిఫామ్ వేసుకుని సైకిల్ పై అసెంబ్లీకి..

విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఇప్పటికి కూడా పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్, సైకిళ్లు, ల్యాప్ టాప్ లు ఎందుకు ఇవ్వలేదని అసెంబ్లీలో డీఎంకే ఎమ్మెల్యేలు ఆల్ ఇండియా ఎన్నారై కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

స్కూల్ పిల్లల అవతారంలో ఎమ్మెల్యేలు.. బ్యాగ్, యూనిఫామ్ వేసుకుని సైకిల్ పై అసెంబ్లీకి..
X

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో డీఎంకే ఎమ్మెల్యేలు స్కూల్ పిల్లల అవతారం ఎత్తారు. యూనిఫామ్ ధరించి, ఐడీ కార్డ్స్ మెడలో వేసుకుని, బ్యాగ్ తగిలించుకొని సైకిళ్లపై ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించని ప్రభుత్వ తీరును నిరసిస్తూ డీఎంకే ఎమ్మెల్యేలు ఈ విధంగా ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే విద్యార్థులకు పుస్తకాలు, షూస్, యూనిఫామ్, సైకిళ్లు అందజేస్తున్నారని, కానీ పుదుచ్చేరిలో ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం ఎటువంటి పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు.

విద్యా సంవత్సరం ముగుస్తున్నా ఇప్పటికి కూడా పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్, సైకిళ్లు, ల్యాప్ టాప్ లు ఎందుకు ఇవ్వలేదని అసెంబ్లీలో డీఎంకే ఎమ్మెల్యేలు ఆల్ ఇండియా ఎన్నారై కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకే యూనిఫామ్, పుస్తకాల బ్యాగులు ధరించి అసెంబ్లీకి వచ్చినట్లు డీఎంకే ఎమ్మెల్యేలు తెలిపారు. ఎమ్మెల్యేలు విద్యార్థుల అవతారంలో సైకిల్ తొక్కుకుంటూ వీధుల వెంట వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

First Published:  3 Feb 2023 1:59 PM GMT
Next Story