Telugu Global
National

మహిళా రెజ్లర్లను వేధించినట్టు ఆధారాలున్నాయి : ఢిల్లీ పోలీసులు

తజికిస్థాన్‌లో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్టు పోలీసులు కోర్టుకి వెల్లడించారు. బ్రిజ్ భూషణ్‌కి తాను చేసేది తప్పు అని తెలిసినా పదేపదే అదే తప్పు చేశారని స్పష్టం చేశారు.

మహిళా రెజ్లర్లను వేధించినట్టు ఆధారాలున్నాయి : ఢిల్లీ పోలీసులు
X

భారత మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న WFI చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లలోని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మహిళా రెజ్లర్ల‌పై లైంగిక వేధింపుల కోసం తనకు చిక్కిన ఏ చిన్న అవకాశాన్నీ బ్రిజ్‌భూషణ్‌ సింగ్ వదులుకోలేదని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. మహిళా రెజ్లర్లతో బ్రిజ్‌భూషణ్‌ నీచమైన చర్యలకు తెగబడేవాడని బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను బట్టి తెలుస్తోందన్నారు.

ఈ కేసులో నిన్నరౌజ్ అవెన్యూ కోర్టులో వాదనలు జరిగాయి. నిజానికి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో భూషణ్ సింగ్‌ కూడా విచారణకు హాజరవ్వాల్సి ఉన్నప్పటికీ కోర్టు అందుకు మినహాయింపునిచ్చింది. ఢిల్లీ పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ శ్రీవాస్తవ వాదనలు వినిపిస్తూ.. బ్రిజ్‌భూషణ్‌కు తాను ఏం చేస్తున్నానో తెలుసని పేర్కొన్నారు. ఆయనపై అభియోగాలు మోపేందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీర్పీసీ) కింద రాతపూర్వక ఫిర్యాదు, సెక్షన్ 161 (సాక్షుల విచారణ), 164 (మేజిస్ట్రేట్ ముందు నమోదు చేసిన వాంగ్మూలాలు).. ఈ మూడు రకాల సాక్ష్యాలు సరిపోతాయని పేర్కొన్నారు.

తజికిస్థాన్‌లో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించినట్టు పోలీసులు కోర్టుకి వెల్లడించారు. బ్రిజ్ భూషణ్‌కి తాను చేసేది తప్పు అని తెలిసినా పదేపదే అదే తప్పు చేశారని స్పష్టం చేశారు. అయితే భారతదేశం వెలుపల జరిగిన కేసులకు సీర్పీసీ సెక్షన్ 188 ప్రకారం అనుమతి అవసరమన్న బ్రిజ్‌భూషణ్ తరఫు న్యాయవాది వాదనకు అతుల్ కౌంటర్ ఇచ్చారు. నేరాలన్నీ దేశం బయట జరగ‌లేదని, ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ నేరాలు జరిగాయని, కాబట్టి ఎలాంటి అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు.

గతంలో ఈ కేసులో విచారణ జరిపేందుకు ఏర్పాటు చేసిన కమిటీ బ్రిజ్ భూషణ్‌ని నిర్దోషిగా తేల్చలేదని, ఢిల్లీ పోలీసులు గుర్తుచేశారు. మహిళా రెజ్లర్ల చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్రీడామంత్రి నేతృత్వంలో ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ అందులో ఏముందన్నది బయట పెట్టలేదు. ఈ కేసులో బ్రిజ్ భూషణ్ దోషిగా తేలితే మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.

*

First Published:  24 Sep 2023 7:14 AM GMT
Next Story