Telugu Global
National

ఢిల్లీ మద్యం కేసు: చార్జ్ షీట్ లో ఆ ఎంపీ పేరు పొరపాటున చేర్చాం, క్షమించండన్న ఈడీ... మండిపడ్డ కేజ్రీవాల్

ED అధికారులు సంజయ్ సింగ్ కు క్షమాపణ చెప్పారు. క్లరికల్ మిస్టేక్ వల్ల రాహుల్ సింగ్ అనే పేరుకు బదులు సంజయ్ సింగ్ అనే పేరు చార్జ్ షీట్ లో చేర్చామని ఈడీ అధికారులు తెలిపారు.

ఢిల్లీ మద్యం కేసు: చార్జ్ షీట్ లో ఆ ఎంపీ పేరు పొరపాటున చేర్చాం, క్షమించండన్న ఈడీ... మండిపడ్డ కేజ్రీవాల్
X

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ పేరును చేర్చింది. దీనిపై సంజయ్ సింగ్ ఈడీ అధికారులకు నోటీసు పంపారు.

దాంతో ED అధికారులు సంజయ్ సింగ్ కు క్షమాపణ చెప్పారు. క్లరికల్ మిస్టేక్ వల్ల రాహుల్ సింగ్ అనే పేరుకు బదులు సంజయ్ సింగ్ అనే పేరు చార్జ్ షీట్ లో చేర్చామని ఈడీ అధికారులు తెలిపారు.

టైపోగ్రాఫికల్/క్లరికల్ లోపం తమ దృష్టికి రాగానే ఛార్జ్ షీట్ లోని తప్పును సరిదిద్దడానికి తాము ఏప్రిల్ 20న ప్రత్యేక PMLA కోర్టు ముందు ఒక పిటిషన్‌ను దాఖలు చేశామని వారు తెలిపారు.

దీనిపై ఆప్ అధ్యక్షులు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మండిపడ్డారు. దేశంలోని అత్యంత నిజాయితీ గల పార్టీ పరువు తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన పొరపాటున ఒకరి పేరును ఛార్జిషీట్‌లో ఎలా చేర్చుతారని ప్రశ్నించారు.

"పొరపాటున ఒకరి పేరును ఛార్జిషీట్‌లో చేర్చవచ్చా? దీన్నిబట్టి మొత్తం కేసు నకిలీదని స్పష్టమైంది. కేవలం దేశంలోని అత్యంత నిజాయితీ గల పార్టీ పరువు తీసేందుకే ప్రధాని ఇలా చేస్తున్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న పార్టీపై డర్టీ పాలిటిక్స్‌లో భాగంగా ఈ విధంగా దాడి చేయడం వారికి తగదు.'' అన్నారు కేజ్రీవాల్

First Published:  3 May 2023 1:40 PM GMT
Next Story