Telugu Global
National

ఢిల్లీ ఘటన.. యువతిపై అత్యాచారం జరగలేదని తేల్చిన వైద్య బృందం

యాక్సిడెంట్ చేసిన కారులో ఐదుగురు యువకులు ఉండగా.. వారంతా పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా యువతి శరీరాన్ని కారు కొన్ని కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్ళింది..

ఢిల్లీ ఘటన.. యువతిపై అత్యాచారం జరగలేదని తేల్చిన వైద్య బృందం
X

న్యూ ఇయర్ రోజున ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. స్కూటీపై వెళ్తున్న ఓ యువతిని ఢీకొన్న కారు ఆమెను కిలోమీటర్ల దూరం ఈడ్చుకువెళ్లడంతో ఆమె శరీరం ఛిద్రమైంది. అయితే యువతి శరీరంపై దుస్తులు లేకపోవడంతో ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. యువతి తల్లిదండ్రులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే యువతిపై అత్యాచారం జరగలేదని తాజాగా ఆమెకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్య బృందం ప్రకటించింది.

న్యూ ఇయర్ రోజున ఢిల్లీలో ఓ యువతి తన స్నేహితురాలితో కలిసి ఒక హోటల్ నుంచి బయటికి వచ్చే దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్ లో నమోదయ్యాయి. ఆ సమయంలో ఆమె తన వెంట వచ్చిన మరో యువతితో కొంతసేపు వాదించుకున్నట్లు హోటల్ మేనేజర్ తెలిపారు. ఆ తర్వాత వారిద్దరూ స్కూటీపై బయలుదేరే సమయంలో ఆమె పక్కన కొంతమంది యువకులు కనిపించారు. యువతి, ఆమె స్నేహితురాలు హోటల్ దగ్గర నుంచి కొంత దూరం వెళ్లగానే వేగంగా వచ్చిన ఒక కారు వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యువతి శరీరం యాక్సెల్ లో ఇరుక్కుపోవడంతో కారు ఆమెను ఈడ్చుకుంటూ వెళ్ళింది. అయితే ఆమె స్నేహితురాలు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది.

యాక్సిడెంట్ చేసిన కారులో ఐదుగురు యువకులు ఉండగా.. వారంతా పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా యువతి శరీరాన్ని కారు కొన్ని కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్ళింది.. అయితే యువతి శరీరం పడిపోయిన చోట ఆమె శరీరంపై దుస్తులు లేవని.. ఆమెపై అత్యాచారం ఏమైనా జరిగి ఉంటుందని స్థానికులు, యువతి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఇవాళ యువతి శరీరానికి మౌలానా మెడికల్ కాలేజీలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య బృందం యువతిపై అత్యాచారం జరగలేదని నిర్ధారించారు. ఆమె వ్యక్తిగత అవయవాల వద్ద ఎటువంటి గాయాలు లేవని పోస్టుమార్టం లో తేలినట్లు వారు వెల్లడించారు.

First Published:  3 Jan 2023 5:04 PM GMT
Next Story