Telugu Global
National

పెళ్లి వేళ.. వరుడిని హతమార్చిన తండ్రి

ప్రతిరోజూ తనతో గొడవపడుతున్న కుమారుడు.. పెళ్లి రోజు కూడా గొడవపడటాన్ని తండ్రి సహించలేకపోయాడు. కోపంతో ఊగిపోతూ కత్తితో కుమారుడిపై దాడి చేశాడు.

పెళ్లి వేళ.. వరుడిని హతమార్చిన తండ్రి
X

అక్కడ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. అందరూ పెళ్లి సందడిలో మైమరిచిపోయి ఉన్నారు. అంతలోనే ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సిన ఇల్లు తీరని విషాదంలో మునిగిపోయింది. వరుడిని తండ్రే హతమార్చడంతో నిర్ఘాంతపోవడం పెళ్లి వేడుకకు వచ్చిన బంధువుల వంతయింది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

ఢిల్లీలో జిమ్ సెంట‌ర్ నడుపుతున్న యువకుడు గౌరవంఘాల్‌ (29)కి వివాహం నిశ్చయమైంది. గురువారం అతనికి పెళ్లి జరగాల్సి ఉంది. మరికొన్ని గంటల్లో పెళ్లి ముహూర్తం ఉండగా, పెళ్లి వేడుకల్లో కుటుంబ సభ్యులు, బంధువులు నిమగ్నమై ఉన్నారు. మరోపక్క తండ్రీ కొడుకుల మధ్య వివాదం తలెత్తడంతో వారి మధ్య వాగ్వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో కోపం పట్టలేకపోయిన తండ్రి రంగలాల్‌ తన కుమారుడిని కత్తితో పొడిచి హతమార్చాడు. ఏకంగా 15 సార్లు కత్తి పోట్లు పొడవడం గమనార్హం.

ప్రతిరోజూ తనతో గొడవపడుతున్న కుమారుడు.. పెళ్లి రోజు కూడా గొడవపడటాన్ని తండ్రి సహించలేకపోయాడు. కోపంతో ఊగిపోతూ కత్తితో కుమారుడిపై దాడి చేశాడు. ఈ ఘటన అనంతరం తండ్రి అక్కడి నుంచి పరారయ్యాడు. పెళ్లి వేడుకల్లో ఉన్న బంధువులు ఈ విషయాన్ని గుర్తించలేదు. వివాహ ఊరేగింపు కోసం వరుడిని తీసుకెళ్లేందుకు వచ్చినవారు అతను రక్తపు మడుగులో ప‌డివుండటం చూసి హతాశులయ్యారు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప‌రారీలో ఉన్న తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు హత్య చేసిన విషయాన్ని అంగీకరించినట్టు డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ అంకిత్‌ చౌహాన్‌ తెలిపారు.

First Published:  8 March 2024 1:30 PM GMT
Next Story