Telugu Global
National

మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్‌

మద్యం కుంభకోణం కేసులో శనివారం కోర్టు ముందు హాజరైన కేజ్రీవాల్‌కు రూ.15 వేల బాండ్, లక్ష రూపాయల పూచీకత్తుతో కోర్టు బెయిల్‌ ఇచ్చింది.

మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్‌
X

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. ఆయనకు ఈ కేసులో న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. మద్యం కుంభకోణం కేసులో శనివారం కోర్టు ముందు హాజరైన కేజ్రీవాల్‌కు రూ.15 వేల బాండ్, లక్ష రూపాయల పూచీకత్తుతో కోర్టు బెయిల్‌ ఇచ్చింది. అనంతరం కేజ్రీవాల్‌ కోర్టు అనుమతితో న్యాయస్థానం నుంచి వెళ్లిపోయారు.

మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌కు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) 8 సార్లు సమన్లు పంపిన విషయం తెలిసిందే. అయితే వాటిని కేజ్రీవాల్‌ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఈడీ ఈ విషయమై గత నెలలో కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన న్యాయస్థానం.. కేజ్రీవాల్‌ను ఫిబ్రవరి 17న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది.

అప్పట్లో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున న్యాయస్థానం ముందు వర్చువల్‌గా హాజరైన సీఎం కేజ్రీవాల్‌.. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. అయితే.. ఈ అంశం కోర్టులో పెండింగులో ఉండగానే ఈడీ కేజ్రీవాల్‌కు మరిన్ని సమన్లు జారీ చేసింది. చివరిసారిగా మార్చి 4న విచారణకు రావాలని పిలవగా.. సీఎం గైర్హాజరయ్యారు. అయితే, విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఈడీకి సమాధానం పంపారు. మార్చి 12 తర్వాత వర్చువల్‌గా హాజరవుతానని తెలిపారు. దీంతో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించగా.. మార్చి 16న తప్పనిసరిగా తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. దానిలో భాగంగానే శనివారం కేజ్రీవాల్‌ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడీ ఫిర్యాదుపై విచారణ జరిపిన న్యాయస్థానం.. కేజ్రీవాల్‌పై మోపిన అభియోగాలు బెయిల్‌ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లని తెలిపారు. ఈ సందర్భంగా ఈడీ చేసిన రెండు ఫిర్యాదుల్లో కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

First Published:  16 March 2024 6:06 AM GMT
Next Story