Telugu Global
National

ఆశా పరేఖ్ కు దాదాసాహెబ్ పాల్కే అవార్డు

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఈ సారి హిందీ నటి ఆశా పరేఖ్ ను వరించింది. దాదాపు 5 దశాబ్దాల పాటు ఆశా త‌న సినీ జీవితంలో ఎన్నో మ‌ర‌పురాని, ప్ర‌తిష్టాత్మ‌క పాత్ర‌లు పోషించారు. ఆశా పరేఖ్ 10 సంవత్సరాల వయస్సులో బేబీ ఆశా పరేఖ్ పేరుతో `మా` చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు.

ఆశా పరేఖ్ కు దాదాసాహెబ్ పాల్కే అవార్డు
X

ప్రముఖ హిందీ సినీ నటి,దర్శకురాలు,నిర్మాత ఆశా పరేఖ్‌ ప్ర‌తిష్టాత్మ‌క దాదాసాహెబ్ ఫాల్కే పుర‌స్కారానికి ఎంపిక‌య్యారు. ఈ యేడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెకు అత్యున్న‌త జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయనున్నారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ తన ట్విటర్ ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు.

"భారతీయ సినిమాకి ఆదర్శప్రాయమైన జీవితకాల సేవలు అందించిన ఆశా పరేఖ్ జీని గుర్తించి, అవార్డు ఇవ్వాలని దాదాసాహెబ్ ఫాల్కే సెలక్షన్ జ్యూరీ నిర్ణయించిందని ప్రకటించడం గౌరవంగా ఉంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఈ నెల 30న విజ్ఞాన్ భవన్‌లోని 68వ ఎన్ఎఫ్ఎ (నేష‌న‌ల్ ఫిల్మ్ అవార్డ్స్‌) వేడుక‌లో గౌరవ రాష్ట్రపతి ప్రదానం చేస్తారు." అని మంత్రి అనురాగ్‌ పేర్కొన్నారు.

దాదాపు 5 దశాబ్దాల పాటు ఆశా త‌న సినీ జీవితంలో ఎన్నో మ‌ర‌పురాని, ప్ర‌తిష్టాత్మ‌క పాత్ర‌లు పోషించారు. ఆశా పరేఖ్ 10 సంవత్సరాల వయస్సులో బేబీ ఆశా పరేఖ్ పేరుతో `మా` చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. బిమల్ రాయ్ దర్శకత్వం లో బాంబే టాకీస్‌, బాప్ బేటీ చిత్రాల‌తో పాటు మ‌రికొన్ని చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్టుగా న‌టించి ఆ త‌ర్వాత చ‌దువు కోసం సినిమాల‌కు కొంత‌కాలం దూరంగా ఉన్నారు. తిరిగి 16 యేళ్ళ వ‌య‌సులో ఆమె సినిమాల్లో త‌న అదృష్టాన్ని వ‌రీక్షించుకునేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ ఆమె స్టార్ కాద‌ని విజయ్ భట్ సినిమా `గూంజ్ ఉతి షెహనాయ్` లో ఆమెను తీసుకోలేదు.

ఆ తరువాత, చిత్ర నిర్మాత సుబోధ్ ముఖర్జీ , రచయిత-దర్శకుడు నాసిర్ హుస్సేన్ (బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మేనమామ) ఆమెను షమ్మీ కపూర్ సరసన `దిల్ దేకే దేఖో`లో కథానాయికగా తీసుకున్నారు, ఈ చిత్రం ఆమెకు స్టార్ హోదా క‌ట్ట‌బెట్టింది. ఈ చిత్రంతో ఆశా, నాసిర్ మధ్య సుదీర్ఘ అనుబంధానికి దారితీసింది. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు కూడా వచ్చాయి, ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఆత్మ‌క‌థ‌ జ్ఞాపకం `ది హిట్ గర్ల్`లో ధృవీకరించింది.

సినిమా రంగానికి ఆమె చేసిన కృషికి గుర్తింపుగా 1992లో పద్మశ్రీతో సత్కరించారు.ఆ తర్వాత‌ మూడు సంవత్సరాలకు ఆమె `ఆందోలన్`లో నటించింది. 1999 లో `సర్ ఆంఖోన్ పర్`లో ఆమె అతిధి పాత్రలో కనిపించిన తర్వాత నుంచి సినిమాల‌కు దూరంగా ఉన్నారు. ఆమె 95 కు పైగా చిత్రాలలో పనిచేశారు. 1998-2001 మధ్యకాలంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్‌కు చైర్‌పర్సన్‌గా వ్య‌వ‌హ‌రించారు." అని ఠాకూర్ తెలిపారు.

దక్షిణాది సినిమా సూపర్ స్టార్ రజనీకాంత్ చివరిసారిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే కమిటీలో సినీ పరిశ్రమ దిగ్గజాలు ఆశా భోంస్లే, హేమ మాలిని, ఉదిత్ నారాయణ్, పూనమ్ ధిల్లాన్, టిఎస్ నాగాభరణ ఉన్నారు.

First Published:  27 Sep 2022 11:28 AM GMT
Next Story