Telugu Global
National

ఆ 3 రాష్ట్రాల‌కూ తీవ్ర తుపాను ముప్పు..!

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహరాష్ట్రలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది.

ఆ 3 రాష్ట్రాల‌కూ తీవ్ర తుపాను ముప్పు..!
X

క‌ర్నాట‌క‌, గోవా, మ‌హారాష్ట్రలకు మ‌రో 24 గంట‌ల్లో తీవ్ర తుపాను ముప్పు ఏర్ప‌డ‌నుంది. ఈ మేర‌కు భార‌త వాతావ‌ర‌ణ శాఖ శ‌నివారం వెల్ల‌డించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన 'బిపోర్‌జాయ్‌ ' తుపాను మరో 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చనున్నట్టు తెలిపింది. ఇది మరింత బలపడి ఉత్తర ఈశాన్య దిశగా కదులుతుందని వెల్లడించింది.

తుపాను ప్రభావంతో కర్ణాటక, గోవా, మహరాష్ట్రలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. తుపాను ప్రస్తుతం గోవాకు పశ్చిమాన 690 కిలోమీట‌ర్ల‌ దూరంలో, ముంబయికి పశ్చిమ - నైరుతి దిశలో 640 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.

65 కిలోనాట్స్ వ‌ర‌కు ఈదురుగాలులు...

తుపాను కారణంగా జూన్ 10 నుంచి 12 వరకు 45 నుంచి 55 కిలోనాట్స్ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని.. ఇవి 65 కిలోనాట్స్ వరకూ చేరవచ్చని అధికారులు తెలిపారు. దీంతో అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ అలల కారణంగా గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం తితాల్ బీచ్‌ని ఈ నెల 14 వరకు మూసివేస్తున్నట్టు స్థానిక అధికారులు తెలిపారు.

First Published:  10 Jun 2023 6:57 AM GMT
Next Story