Telugu Global
National

మా పార్టీ వల్లే ఐపీఎల్ ఫైనల్లో సీఎస్కే విజయం.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి వితండవాదం

చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన తరుణంలో జడేజా వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు. కాగా, జడేజా మ్యాచ్ గెలిపించాడు కాబట్టి అది బీజేపీ గెలిపించినట్లేనని తాజాగా అన్నామలై వ్యాఖ్యానించారు.

మా పార్టీ వల్లే ఐపీఎల్ ఫైనల్లో సీఎస్కే విజయం.. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి వితండవాదం
X

నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేశారు. తమ పార్టీ వల్లే చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 16వ సీజన్ లో కప్ సాధించిందని విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై సీఎస్కే, ధోనీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఐపీఎల్ లో భాగంగా సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో చివరి బంతికి సీఎస్కే విజయం సాధించి ఐదోసారి ట్రోఫీ గెలిచింది.

చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సిన తరుణంలో జడేజా వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు. కాగా, జడేజా మ్యాచ్ గెలిపించాడు కాబట్టి అది బీజేపీ గెలిపించినట్లేనని తాజాగా అన్నామలై వ్యాఖ్యానించారు. గుజరాత్ కు చెందిన జడేజా బీజేపీ కార్యకర్త అని, అతడి భార్య రివాబా జడేజా బీజేపీ ఎమ్మెల్యే అని అన్నామలై గుర్తుచేశారు.

గత ఎన్నికల్లో ఆమె విజయం కోసం బీజేపీ తరఫున జడేజా ప్రచారం నిర్వహించారని చెప్పారు. కాగా, అన్నామలై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఎస్కే ఫ్యాన్స్ ఆయ‌న‌పై ఎదురుదాడికి దిగారు. జడేజా భార్య బీజేపీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన బీజేపీ వల్లే చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిందని అనడం ఏంటని తిట్టిపోస్తున్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నామలైకి సూచించారు.

First Published:  31 May 2023 8:51 AM GMT
Next Story