Telugu Global
National

ప్రేమలో పడి పరువు తీసిందని.. కుమార్తె, ఆమె ప్రియుడిని హత్య చేసి నదిలో పడేసిన తండ్రి

తోమర్ బంధువు ఒకరు పోలీసులకు ఫోన్ చేసి శివానీ కుటుంబ సభ్యులు తోమర్‌ను కిడ్నాప్ చేశారని.. అప్పటినుంచి కనిపించని ఆ కుటుంబ సభ్యులు ఐదు రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చారని ఫిర్యాదు చేశారు.

ప్రేమలో పడి పరువు తీసిందని.. కుమార్తె, ఆమె ప్రియుడిని హత్య చేసి నదిలో పడేసిన తండ్రి
X

ఓ యువకుడిని ప్రేమించడమే ఆ యువతి చేసిన పాపం.. పరువు తీసిందని ఆమె తండ్రి కుమార్తెతోపాటు ప్రేమికుడిని హత్య చేసి మృతదేహాలను నదిలో పడేశాడు. సంచలనం సృష్టించిన ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మొరెనాకు చెందిన రాజ్ పాల్‌కు శివానీ (18) అనే కుమార్తె ఉంది. ఆమె రాధే శ్యామ్ తోమర్ (21) అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమెను మందలించారు.

ఇదిలా ఉండగా.. జూన్ 3వ‌ తేదీన తన కుమార్తె శివానీ అదృశ్యం అయినట్లు రాజ్ పాల్ అంబాహ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో శివానీ ప్రేమికుడు తోమర్ కూడా కనిపించకుండా పోవడంతో 4వ తేదీన తోమర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తోమర్, శివానీ జాడ కోసం గాలింపు చ‌ర్య‌లు చేపట్టారు.

ఇదిలా ఉండగా.. తోమర్ బంధువు ఒకరు పోలీసులకు ఫోన్ చేసి శివానీ కుటుంబ సభ్యులు తోమర్‌ను కిడ్నాప్ చేశారని.. అప్పటినుంచి కనిపించని ఆ కుటుంబ సభ్యులు ఐదు రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాజ్ పాజ్‌ని అదుపులోకి తీసుకొని విచారించారు.

విచారణలో అతడు తన కుమార్తె, ఆమె ప్రియుడిని చంపి వారి మృతదేహాలను చంబల్ నదిలో పడవేసినట్లు అంగీకరించాడు. దీంతో అంబాహ్ పోలీసులు రాజ్ పాల్‌ని ఆదివారం వెంటపెట్టుకొని చంబల్ నది ప్రాంతానికి వెళ్లారు. మృతదేహాలను నదిలోని హోలపురా ఘాట్ ప్రాంతంలో పడేసినట్లు గుర్తించారు.

ప్రస్తుతం ప్రత్యేక పోలీసు బృందాలను రప్పించి ప్రేమికుల మృతదేహాలను వెలికితీసే పనులు చేపట్టినట్లు అంబాహ్ సబ్ డివిజనల్ పోలీసు అధికారి పర్మల్ సింగ్ తెలిపారు. ప్రేమలో పడి పరువు తీసిందని కుమార్తెను, ఆమె ప్రియుడిని హత్య చేసిన సంఘటన మధ్యప్రదేశ్ లో సంచలనం సృష్టించింది.

First Published:  19 Jun 2023 9:46 AM GMT
Next Story