Telugu Global
National

కరోనాపై కేంద్రం లేఖ.. తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో అలర్ట్..

తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాసింది. హఠాత్తుగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని, నియంత్రణ మీద దృష్టిసారించాలని ఆ లేఖల్లో పేర్కొంది.

Coronavirus in Telangana: కరోనాపై కేంద్రం లేఖ.. తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో అలర్ట్..
X

Coronavirus in Telangana: కరోనాపై కేంద్రం లేఖ.. తెలంగాణ సహా 6 రాష్ట్రాల్లో అలర్ట్..

అధికారికంగా కరోనా కేసులు భారత్ లో అక్కడక్కడ కనపడుతున్నాయి. ప్రస్తుతం కేసులు తక్కువగానే ఉన్నా.. రాబోయే రోజుల్లో భారీగా పెరిగే అవకాశం మాత్రం ఉంది, జర జాగ్రత్త.. అంటూ కేంద్రం, రాష్ట్రాలను హెచ్చరించింది. ప్రధానంగా 6 రాష్ట్రాలకు ముప్పు పొంచి ఉందని వార్నింగ్ బెల్ మోగించింది. ఆ ఆరు రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉండటం గమనార్హం.

భారత్‌ లో మరోసారి కొత్త వేరియెంట్‌ విజృంభించే అవకాశం కనిపిస్తోందని కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనపడుతోందని, మరోవైపు ఫ్లూ కేసులు కూడా గణనీయంగా నమోదు అవుతున్నాయని తెలిపింది. తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం లేఖలుf రాసింది. హఠాత్తుగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని, నియంత్రణ మీద దృష్టిసారించాలని ఆ లేఖలో పేర్కొంది.

మహారాష్ట్ర, గుజరాత్‌, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ లేఖలు రాశారు. కరోనా పరీక్షల సంఖ్య పెంచాలని, చికిత్స, ట్రాకింగ్‌ తో పాటు వ్యాక్సినేషన్‌ పై కూడా దృష్టిసారించాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితుల దృష్ట్యా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, కాబట్టి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆరోగ్య శాఖ సూచించింది. గ్రామ స్థాయి నుంచి ఈ పర్యవేక్షణ ఉండాలని కోరింది.

ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఆరోగ్య కార్యదర్శి లేఖలు రాశారు. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని కోరారు. చివరిసారిగా గతేడాది నవంబర్‌ 12న దేశవ్యాప్తంగా 734 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నాలుగు నెలల గ్యాప్ తర్వాత బుధవారం 700కి పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4 వేలకు పైగానే ఉంది. యాక్టివ్‌ కేసుల శాతం 0.01 కాగా, రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. ఈ గణాంకాలు ఇబ్బంది పెట్టేవి కాకపోయినా, రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని కేంద్రం లేఖల ద్వారా హెచ్చరించింది.

First Published:  17 March 2023 4:14 AM GMT
Next Story